ప్రేమికుల రోజు కానుకగా విడుదలైన సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. యువ హీరో సంతోష్ శోభన్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి జంటగా నటించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. తమిళ దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. మిగతా సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ, ఈ సినిమాలోని స్వచ్ఛమైన ప్రేమకథ యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా బాగా మెప్పిస్తోంది.
Also Read : Raashii Khanna: మహాశివరాత్రికి రాశీఖన్నా ప్రత్యేక కానుక..
ఇక ఈ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా సక్సెస్ మీట్ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇచ్చారు. సంతోష్ శోభన్ – మానస వారణాసి కెమిస్ట్రీకి వస్తున్న రెస్పాన్స్ చూసి, ఇదే జోడీతో మరో ప్రేమకథా చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతే కాదు.. ఈ కొత్త సినిమాను కూడా వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే (2027) సందర్భంగా విడుదల చేయనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ‘కపుల్ ఫ్రెండ్లీ’ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ తో కలిసి తాను ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు ధీరజ్ తెలిపారు. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్లో ఉంచారు. వరుసగా రెండో ఏడాది కూడా అదే డేట్కి, అదే జోడీతో రాబోతుండటం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. మరి వచ్చే ఏడాది రాబోయే సినిమా కూడా ఇదే రేంజ్ లో హిట్ అవుతుందేమో చూడాలి!