నందమూరి రెండవ తరం నటుడిగా 1974లో వచ్చిన తాతమ్మ కల చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టారు నందమూరి బాలకృష్ణ. తండ్రి నందమూరి తారక రామారావు వారసత్వాన్ని పుణికి పుచుకొని, తండ్రికి తగ్గ తనయుడిగా అంచలంచలుగా ఎదుగుతూ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని నందమూరి లెగసిని కొనసాగిస్తున్నారు బాలయ్య. ఈ సినీప్రయాణంలో ఎన్నో మైలు రాళ్లు దాటుకుని, మరెన్నో శిఖరాలు చేరుకొని నాటి నుండి నేటి వరకు అగ్ర కథానాయకుడిగా సాగుతున్నారు.
కాగా నందమూరి నటసింహ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఈ ఏడాదికి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. తాతమ్మ కల చిత్రం నుండి మొన్న వచ్చిన భగవంత్ కేసరి చిత్రం వరకు బాలయ్య సినీ జీవితం ఓ సాహసం అనే చెప్పాలి. తారక రామారావు కొడుకు హీరోగా వస్తున్నాడు అంటే అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా నందమూరి అభిమానులు గర్వించే హీరోగా ఇండస్ట్రీ హిట్ సినిమాలలో నటించి రికార్డులు తిరగ రాశారు. అప్పటి వరకు పౌరాణికం, పల్లెటూరు నేపథ్యం, కుటుంబ కథ చిత్రాలు ఎక్కువగా వస్తున్న రోజుల్లో ‘సమర సింహ రెడ్డి’ చిత్రంతో టాలీవుడ్ గతిని మర్చి కొత్త ట్రెండ్ సృష్టించారు బాలయ్య. బైరవద్వీపంలో కురూపి, ఆదిత్య 369 చిత్రంలో కృష్ణదేవరాయులు, అఖండలో అఘోరా వంటి పాత్రల్లో బాలయ్య తప్ప మరెవరు నటించలేరని నిరూపించారు. ఇన్నేళ్ల కెరీర్ లో బాలయ్య నటించని జానర్ లేదంటే అతిశయోక్తి కాదు.
బాలయ్య 50 ఏళ్ల ఇండస్ట్రీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు . రానున్న సెప్టెంబరు 1న కూకట్ పల్లి ఖైతలాపుర్ గ్రౌండ్స్ లో భారీ ఈవెంట్ తలపెట్టారు. శ్రేయాస్ మీడియా నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్నీ సౌత్ ఇండియా సెలెబ్రిటీలతో స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్ అగ్ర హీరోలు సైతం అటెండ్ అవ్వనున్నారు.