‘కేజీఎఫ్, కేజీఎఫ్-2’ చిత్రాలతో సంగీత దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పాపులర్ మ్యూజిక్ దర్శకుడు రవి బసుర్. ఈ చిత్రాలకు రవి బసుర్ అందించిన స్వరాలు, నేపథ్య సంగీతం సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి. ఇక ‘కేజీఎఫ్-2’ తరువాత రవి బసుర్ సంగీతం అందిస్తున్న మరో పాన్ఇండియా చిత్రం ‘శాసనసభ’. ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా నటిస్తున్న ఈ మూవీలో సీనియర్ నటుడు డా. రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని దీనిని నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నేపథ్య సంగీతం పనుల్లో సంగీత దర్శకుడు రవి బసుర్ బిజీగా వున్నారు.

ఈ సినిమా విశేషాలను నిర్మాత షణ్ముగం సాప్పని తెలియజేస్తూ , ”పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి రవి బసుర్ అందిస్తున్న సంగీతం, నేపథ్యసంగీతం మెయిన్పిల్లర్గా ఉంటాయి. ఆయనతో పనిచేయడం ఎంతో గర్వంగా వుంది. ‘శాసనసభ’ విషయంలో ఆయన చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధతో ఎంతో అద్బుతంగా అవుట్పుట్ వచ్చింది. ‘కేజీఎఫ్-2’ తరువాత తెలుగులో ఆయన నుంచి వస్తున్న చిత్రమిది. తప్పకుండా ఈ చిత్రం మా బ్యానర్ ప్రతిష్టను పెంచేవిధంగా వుంటుంది” అని అన్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్న ఈ చిత్రానికి కథ, మాటలు రాఘవేందర్రెడ్డి అందించారు.