నటుడు అడివి శేష్ ఎప్పుడూ తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడంలో ముందుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. మార్చి 19న ఆయన హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ కూడా విడుదల కానుండటంతో సోషల్ మీడియాలో “బాక్సాఫీస్ వార్ రాబోతోంది” అంటూ చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అడివి శేష్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : Akhanda 2 : “అఖండ 2 తాండవం” సాంగ్ డేట్ ఫిక్స్! థమన్ ఎక్స్క్లూజివ్ అప్డేట్
“బాక్సాఫీస్ వార్ అనేది పూర్తిగా మీడియా సృష్టించిన పదం. ప్రేక్షకులే ఎప్పుడూ విజేతను నిర్ణయిస్తారు. వారే చివరగా జడ్జ్ చేస్తారు. రెండు సినిమాలు ఒకే రోజు విడుదలవడం కొత్త విషయం కాదు. ‘లగాన్’, ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ ఒకేసారి వచ్చి రెండూ బ్లాక్బస్టర్గా నిలిచాయి. అలాగే 2018లో ‘కేజీఎఫ్’ మరియు షారుక్ ‘జీరో’ కూడా ఒకే రోజున రిలీజ్ అయ్యాయి. ప్రేక్షకులు మంచి సినిమాను ఎప్పుడు గుర్తిస్తారు. అందుకే భయపడాల్సిన అవసరం లేదు,” అని శేష్ స్పష్టం చేశారు. అదే సందర్భంలో ఆయన తన సినిమాపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ “‘టాక్సిక్’ సినిమాకు మేం ఏ మాత్రం భయపడటం లేదు. నేను ఎప్పుడూ సైలెంట్గా వచ్చి హిట్ను సొంతం చేసుకుంటాను. నా సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు తప్పకుండా సంతోషపడతారని నాకు నమ్మకం ఉంది. కథే హిట్ అవుతుంది, స్టార్ కాదు. మా టీమ్ చేసిన కష్టానికి ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నా” అన్నారు. శేష్ మాటల్లో స్పష్టంగా కనిపించింది ఆయన విశ్వాసం కథపై, ప్రేక్షకుల అభిరుచిపై ఉందని. వాణిజ్యపరంగా ఎంత పెద్ద సినిమాలు వచ్చినా, మంచి కంటెంట్ ఉన్న సినిమా ఎప్పుడూ గెలుస్తుందనే నమ్మకం ఆయనలో స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ‘డెకాయిట్’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.