Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఈ ఉగ్రదాడి అత్యంత క్షమించరాని క్రూరమైన చర్య అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు వివరించారు.
బాధితులను చూస్తుంటే నా గుండె బరువెక్కుతోంది. ఇలాంటి దారుణాలు జరగకూడదు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
పహల్గాంలో టెర్రరిస్టుల అటాక్ నా మనసును కదిలించేసింది. సొసైటీలో ఇలాంటి దారుణాలకు చోటు లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ రామ్ చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also:Pahalgam Terror Attack: 5 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ప్రాణాలు కోల్పోయిన నేవీ ఆఫీసర్
అల్లు అర్జున్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందమైన ప్రదేశంలో జరిగిన ఈ దారుణం నా హృదయాన్ని కదిలించింది. బాధిత కుటుంబాకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలి అంటూ కోరారు.
మూడు నెలల క్రితం షూటింగ్ కోసం పహల్గాం వెళ్లినట్టు నాని తెలిపారు. 200 మంది అక్కడ పనిచేశామన్నారు. ఇంతలోనే అక్కడ ఇలాంటి దారుణాన్ని ఊహించలేదన్నారు. అక్కడ జరిగిన దారుణం తన హృదయాన్ని కలిచివేస్తోందని తెలిపారు. ఇంత దారుణం ఎందుకు చేశారు అంటూ ప్రశ్నించారు.
ఈ దాడిని అత్యంత తీవ్రంగా ఖండిస్తున్నానని సంజయ్ దత్ అన్నారు. దాడికి పాల్పడిన వారిని క్షమించరాదన్నారు. వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు.
ఉగ్రదాడి తనను కలిచివేసిందన్నారు అక్షయ్ కుమార్. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు చెప్పారు.