Site icon NTV Telugu

Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

Bhatti

Bhatti

తెలంగాణ గడ్డపై కళలకు, కళాకారులకు అత్యున్నత గౌరవం కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025’ను నిర్వహించింది. హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దాదాపు పదేళ్లుగా నిలిచిపోయిన సినీ అవార్డుల ప్రదానోత్సవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో మళ్లీ పునఃప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీద ఈ అవార్డులను అందించడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని భట్టి విక్రమార్క వివరించారు. గద్దర్ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదని, ఆయనొక వ్యవస్థ అని కొనియాడారు. తెలంగాణ ఆత్మను, ఇక్కడి పాటను, ఆటను ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప కళాకారుడికి ఇచ్చే అసలైన గౌరవం ఇదని ఆయన పేర్కొన్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమ కేవలం దక్షిణాదికో లేదా భారతదేశానికో పరిమితం కాకుండా, నేడు హాలీవుడ్ స్థాయికి ఎదిగిందని భట్టి విక్రమార్క గర్వంగా ప్రకటించారు. “సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అది ప్రజల కోసం ఉండాలి. ‘సత్య హరిశ్చంద్ర’, ‘కన్యాశుల్కం’, ‘రోజులు మారాయి’ వంటి చిత్రాలు సమాజంలోని రుగ్మతలపై పోరాడి మార్పుకు నాంది పలికాయి” అని ఆయన గుర్తుచేశారు. నేటి తరం సినిమాలు కూడా అదే విధంగా సామాజిక సందేశాన్ని ఇస్తూ వాణిజ్యపరంగా విజయాలు సాధించడం అభినందనీయమన్నారు.

ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) ఆధ్వర్యంలో, దిల్‌రాజు నేతృత్వంలో జూరీ సభ్యులు అత్యంత పారదర్శకంగా ఈ అవార్డులను ఎంపిక చేశారని డిప్యూటీ సీఎం ప్రశంసించారు. షూటింగ్స్ , ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ, మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున వంటి దిగ్గజాలు ఈ వేడుకకు రావడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చివరగా, అవార్డు గ్రహీతలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. భవిష్యత్తులో మరిన్ని అర్థవంతమైన పాత్రలు పోషించి సమాజానికి దిశానిర్దేశం చేయాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.

Exit mobile version