S.V. Krishna Reddy: సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష నటీనటులుగా శేఖర్ ముత్యాల దర్శకత్వంలో బి.వి రెడ్డి నిర్మించిన చిత్రం ‘భారీ తారాగణం’. ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి ప్రేక్షకాదరణ లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా మూవీ ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ అతిథులుగా ప్రముఖ దర్శకులు యస్. వి. కృష్ణా రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, కమెడియన్ ఆలీ విచ్చేసి, ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ, “దర్శకుడు శేఖర్, నిర్మాత బి. వి.రెడ్డి మంచి కథను సెలెక్ట్ చేసుకుని చాలా బాగా తెరకెక్కించారు. ఈ సినిమాకు సుక్కు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అలీ చిన్న, పెద్ద క్యారెక్టర్ అనే తేడా లేకుండా ఏ పాత్ర ఇచ్చినా ఏమాత్రం వెనకాడకుండా పాత్రలో ఒదిగిపోతాడు. నాకు ఇష్టమైన బాబా గారి కొడుకు ఇందులో హీరోగా చేయడం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు. నిర్మాత అచ్చిరెడ్డి, అలీ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
చిత్ర నిర్మాత బివి.రెడ్డి మాట్లాడుతూ, “కరోనా సెకండ్ వేవ్ లో మా సినిమా స్టార్ట్ అయింది. అప్పటి నుండి మేము స్ట్రగుల్ పడుతూ వచ్చాం. చిన్న నిర్మాత అనుకోకుండా ఏ టైంకు పిలిచినా నటీనటులు, సాంకేతిక నిపుణులు షూటింగ్ కు హాజరై ఎంతో సపోర్ట్ చేశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రం చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుంది” అని అన్నారు. దర్శకులు శేఖర్ ముత్యాల మాట్లాడుతూ, “మా టెక్నీకల్ టీమ్ అంతా చాలా టాలెంటెడ్ పర్సన్స్, వర్క్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పని చేశారు. లవ్ కామెడీ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మూవీ ఉంటుంది” అని చెప్పారు. చిత్ర కథానాయకుడు సదన్, హీరోయిన్స్ దీపికా రెడ్డి, రేఖ నిరోష దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.