ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్ కుమార్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదయ్యింది. బొల్లారంలోని మారుతీనగర్కు చెందిన బ్యాగరి నర్సింహులు(41) పాత సినిమాల రిస్టోరేషన్ టెక్నీషియన్గా పనిచేస్తుంటాడు. అయితే దర్శకుడు దాసరి నారాయణరావు వద్ద 2012 నుంచి 2016 దాకా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సినిమాల రిస్టోరేషన్ పనులు చేశాడు. దాసరి మృతి తర్వాత కూడా పెండింగ్లో ఉన్న పనులను జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి వెళ్లి పూర్తి చేశాడు. అయితే ఇందుకు రావాల్సిన డబ్బుల విషయంలో దాసరి కొడుకులు అరుణకుమార్, ప్రభులతో వివాదం నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల 13న ఫిలింనగర్ లోని ఎఫ్ఎన్ఎసీసీ వద్దకు రావాలని దాసరి అరుణ్ కుమార్ చెప్పడంతో నర్సింహులు తన స్నేహితులు శ్రీనివాస్, చంటితో కలిసి వెళ్లాడు. కాసేపటికి అక్కడికి వచ్చిన అరుణ్ నర్సింహులును కులం పేరుతో దూషించగా.. ఈ నెల 16న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దాసరి దాసరి అరుణ్ కుమార్ పై అట్రాసిటీ కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.