‘అదుర్స్ 2’ పై క్రియేటివ్ డైరెక్టర్ వి.వి. వినాయక్ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కల్ట్ క్లాసిక్ ‘అదుర్స్’ సీక్వెల్పై ఆయన పెదవి విరిచారు. రచయిత కోన వెంకట్ ఇటీవల ‘అదుర్స్ 2’ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని చేసిన వ్యాఖ్యలపై వినాయక్ స్పందిస్తూ, ఫ్యాన్స్కు కాస్త చేదు నిజం చెప్పారు. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ‘అదుర్స్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అందులో ఎన్టీఆర్ పోషించిన ‘చారి’ పాత్ర, బ్రహ్మానందంతో ఆయన కెమిస్ట్రీ ఇప్పటికీ మీమ్స్ రూపంలో మనల్ని నవ్విస్తూనే ఉన్నాయి. కొన్నాళ్లుగా ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, దర్శకుడు వినాయక్ క్లారిటీ ఇచ్చారు.
Also Read:Mohanlal New Movies: లాలట్టన్ లైనప్ మాములుగా లేదుగా.. యంగ్ హీరోలు కూడా సాటిరారు!
“ఫ్రాంక్గా చెప్పాలంటే, ఆ కథ అక్కడితో ముగిసిపోయింది. మళ్ళీ అందులో కొత్తగా చూపించడానికి ఏముంది?” అని ఆయన ప్రశ్నించారు. కేవలం సీక్వెల్ తీయాలి కదా అని బలవంతంగా తీస్తే, మొదటి భాగం అందించిన గొప్ప అనుభూతిని మళ్ళీ తీసుకురాలేమని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని సినిమాలు హిట్టైనప్పుడు వాటిని ఒక మధుర జ్ఞాపకంగా వదిలేయడమే మంచిదని వినాయక్ మాటల సారాంశం. “మళ్ళీ అంత గొప్పగా తీయగలమన్న నమ్మకం నాకే లేదు.. అందుకే దాని జోలికి వెళ్లకుండా ఉండటమే బెటర్” అని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దీనితో ‘అదుర్స్ 2’ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు ఇది కాస్త నిరాశ కలిగించే విషయమే అయినా, ఒక కల్ట్ సినిమా పరువు తీయకూడదనే వినాయక్ నిర్ణయాన్ని విశ్లేషకులు స్వాగతిస్తున్నారు.