Ragi Cookies Recipe: రోజూ టీ తాగేటప్పుడు పిల్లలు బిస్కెట్లు కావాలని మారాం చేస్తుంటారు. టీ లేదా పాలు తాగేటప్పుడు ఏదైనా క్రిస్పీగా కావాలని కోరుకుంటారు. బయట దుకాణాల్లో దొరికే బిస్కెట్లలో మైదాతో పాటు చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. ఈ సమస్యకు ఇక రాగి కుకీస్తో చెక్ పడదాం. ఈ రాగి కుకీస్ చూడటానికి నాన్ఖటాయ్లా ఉంటాయి. బయట కొంచెం క్రిస్పీగా, లోపల మాత్రం మెత్తగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. రాగి పిండి, గోధుమ పిండి, పంచదార, నెయ్యి, యాలకుల పొడి మంచి రుచిని అందిస్తాయి. గుడ్లు లేకుండానే చేసే ఈ బిస్కెట్లు పాలు లేదా వేడి చాయ్తో తింటే సూపర్గా ఉంటాయి. ఒకసారి చేసి డబ్బాలో పెట్టుకుంటే మూడు వారాల వరకు పాడవకుండా నిల్వ ఉంటాయి. ఇందులో పంచదార అనారోగ్య కారకం కాబట్టి దానికి బదులు బెల్లం పొడి వాడొచ్చు. కానీ అలా చేస్తే రుచి కొంచెం మారుతుంది. ఈ రిసిపీలో సగం రాగి పిండి, సగం గోధుమ పిండి వాడుతున్నాం కాబట్టి ఇవి గ్లూటెన్ ఫ్రీ కావు. కావాలంటే కేవలం గోధుమ పిండితో లేదా ఇతర మిల్లెట్ పిండులతో కూడా చేయొచ్చు. ఈ రాగి బిస్కెట్లను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
READ MORE: Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
తయారీ విధానం..
వంట మొదలు పెట్టే ముందు పంచదారను మెత్తగా పొడి చేసుకోవాలి. ఐదు స్పూన్లు పంచదార పొడి చేస్తే సుమారు అర కప్పు వస్తుంది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో రాగి పిండి, గోధుమ పిండి వేసి, అందులో బేకింగ్ పౌడర్ (మీకు ఇష్టమైతేనే), యాలకుల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత నెయ్యిని కరిగించి చల్లారనివ్వాలి. అందులో నుంచి సుమారు ఆరు స్పూన్లు నెయ్యిని పిండిలో పోసి చేత్తో కలుపుకోవాలి. పిండి ఒకటిగా కుదరట్లేదనిపిస్తే.. ఇంకొంచెం నెయ్యి లేదా పాలు ఒకటి రెండు స్పూన్లు వేసుకోవచ్చు. అవసరమైనంత మాత్రమే వాడాలి. సాధారణంగా ఏడు స్పూన్ల నెయ్యితో పిండి బాగా కుదురుతుంది. ఇప్పుడు పిండిని ఒక బంతిలా చేసి మూత పెట్టి అరగంట పాటు ఫ్రిజ్లో ఉంచాలి. తొందర ఉంటే పది నిమిషాలు ఫ్రీజర్లో పెట్టినా సరిపోతుంది. ఇంతలో ఓవెన్ను వేడి చేయాలి. పిండిని బయటకు తీసి చిన్న చిన్న బంతులుగా చేసి, చేత్తో కొంచెం ఒత్తాలి. ఫోర్క్తో పైకి తేలికగా నొక్కితే బాగుంటుంది. బేకింగ్ ట్రేలో ఒక్కో బిస్కెట్ మధ్య కొంచెం దూరం ఉండేలా పెట్టాలి, ఎందుకంటే అవి ఉడికిన తర్వాత కొంచెం పెద్దవిగా మారతాయి. ఓవెన్లో అయితే పన్నెండు నుంచి పద్నాలుగు నిమిషాలు సరిపోతాయి. ఓవెన్ లేకపోతే కుక్కర్లోనూ చేయొచ్చు. కుక్కర్ అడుగున ఉప్పు వేసి ముందుగా వేడి చేయాలి. గాస్కెట్, వెయిట్ తీసేసి, మంట తక్కువగా పెట్టి ట్రేను లోపల పెట్టాలి. పన్నెండు నుంచి పదిహేను నిమిషాలు ఉడికిస్తే బిస్కెట్లు రెడీ అవుతాయి. అవసరమైతే రెండు మూడు బ్యాచుల్లో చేసుకోవచ్చు. బిస్కెట్లు లోపల కొంచెం మెత్తగా అనిపించినా భయపడాల్సిన పనిలేదు. చల్లారిన తర్వాత అవే గట్టిపడతాయి. పూర్తిగా చల్లారాక డబ్బాలో పెట్టుకుంటే మూడు వారాల వరకు చక్కగా ఉంటాయి. ఇవి టేస్టీగా, క్రంచీగా సూపర్గా ఉంటాయి.