Uppudu Pindi: ఈ రోజుల్లో బ్రేక్ ఫాస్ట్ అంటే ఆయిల్, మసాలాలతో నిండిపోతోంది. కానీ మన అమ్మమ్మల కాలంలో నూనె చుక్క కూడా లేకుండా, ఎంతో బలమైన అల్పాహారాలు తయారు చేసేవారు. అలాంటి ఒక అద్భుతమైన, నోరూరించే పాతకాలపు వంటకమే ‘ఉప్పుడు పిండి’. కేవలం 15 నిమిషాల్లో, ఇంట్లో ఉండే బియ్యం రవ్వతో అమృతప్రాయమైన ఈ బ్రేక్ ఫాస్ట్ ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Pawan Kalyan: రామతీర్థం గిరిప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం..!
కావలసిన పదార్థాలు:
బియ్యం రవ్వ – 2 కప్పులు
పెసరపప్పు – 3 టేబుల్ స్పూన్లు
నెయ్యి – 1 టీస్పూన్
జీలకర్ర – 1 టీస్పూన్
పచ్చిమిర్చి తరుగు – 1 టేబుల్ స్పూన్
అల్లం తరుగు – 1 టీస్పూన్
ఇంగువ – పావు టీస్పూన్
పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు
కరివేపాకు – 2 రెమ్మలు
ఉప్పు – రుచికి తగినంత
నీళ్లు – 4 కప్పులు
తయారీ విధానం..
ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని రెండు కప్పుల బియ్యం రవ్వను 5-10 నిమిషాల పాటు దోరగా వేయించాలి. ఆ తర్వాత అందులోనే 3 టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసి మరో రెండు నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేయించిన రవ్వ, పప్పు చల్లారాక నీళ్లతో ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి, జాలి గిన్నెలోకి తీసుకుని నీళ్లన్నీ వడకట్టాలి. అనంతరం మందపాటి గిన్నెలో ఒక టీస్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి వేయించాలి. చివరగా ఇంగువ వేసి కలపాలి.
ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో, దానికి రెట్టింపు అంటే 4 కప్పుల నీళ్లు పోయాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము, కరివేపాకు వేసి ఎసరును బాగా మరగనివ్వాలి. ఎసరు మరుగుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న రవ్వ, పప్పు మిశ్రమాన్ని వేసి కలపాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించాలి. నీరంతా ఇగిరిపోయి దగ్గర పడ్డాక, లో ఫ్లేమ్లో మరో 5 నిమిషాలు ఉంచితే పొడిపొడిగా ఉండే ఉప్పుడు పిండి సిద్ధమవుతుంది. ఈ ఉప్పుడు పిండిని ఆవకాయ లేదా ఏదైనా పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుంది. అతి తక్కువ నెయ్యితో, అసలు నూనె వాడకుండా చేసే ఈ అల్పాహారం పిల్లలకు, పెద్దలకు ఎంతో మేలు చేస్తుంది.
ప్రయోజనాలు ఇవే..
ఈ ఉప్పుడు పిండిలో నూనె అస్సలు వాడము. పైగా ఇందులో వాడే అల్లం, జీలకర్ర, ఇంగువ జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారికి ఇది చాలా తేలికపాటి ఆహారం అని పెద్దలు చెబుతున్నారు.
* బియ్యం రవ్వలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తాయి. ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.
* ఇందులో మనం పెసరపప్పును ఉపయోగిస్తాము. పెసరపప్పులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కండరాల పుష్టికి, పిల్లల ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది.
* నూనె లేని ఆహారం కాబట్టి క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. డైట్లో ఉన్నవారు, బరువు తగ్గాలనుకునే వారు నిరభ్యంతరంగా దీన్ని తీసుకోవచ్చు. ఇది కడుపు నిండిన అనుభూతిని (Satiety) కలిగిస్తుంది, తద్వారా అతిగా తినడాన్ని నివారిస్తుంది.
* దీనిని తయారు చేసేటప్పుడు పాలిష్ చేయని బియ్యం రవ్వ లేదా బ్రౌన్ రైస్ రవ్వ ఉపయోగిస్తే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. పెసరపప్పు, కొబ్బరి తురుము కలవడం వల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచదు.
* మనం వాడే కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి.
ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ అమ్మమ్మల కాలం నాటి ఉప్పుడు పిండిని మీరు కూడా మీకు ఖాళీ ఉన్న సమయంలో ఇంట్లో తప్పకుండా తయారు చేసుకోండి.
READ ALSO: US – Cuba War: ట్రంప్ ‘వార్’ వార్నింగ్.. క్యూబాపై యుద్ధ మేఘాలు! అమెరికా తదుపరి టార్గెట్ ఇదేనా?
