సోషల్ మీడియా లేదా డేటింగ్ యాప్స్లో అమ్మాయిల మోజులో పడి అబ్బాయిలు మోసపోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అయితే, ఇక్కడ ఓ అమ్మాయి దారుణంగా మోసపోయింది. చేజేతులా తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఇండోనేషియాలో ఓ అమ్మాయి తరచూ డేటింగ్ యాప్లో యాక్టివ్గా ఉండేంది. ఈ క్రమంలో ఆమెకు ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. చాలాకాలం పాటు చాటింగ్ చేసుకున్న వీరి అభిరుచులు కలవడంతో.. ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. చాలాసార్లు కలుసుకున్నారు కూడా! దీంతో, వీరి స్నేహం ప్రేమగా మారింది.
తానో సర్జన్ అని, తనకు కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయని చెప్పడంతో.. ఆ అబ్బాయి సంపన్నుడు అనుకొని అమ్మాయి టెంప్ట్ అయ్యింది. అతనితో రిలేషన్షిప్లో ఉండానికి ఒప్పుకోవడమే కాదు, కుటుంబ సభ్యులకు తెలియకుండా పెళ్లి కూడా చేసుకుంది. కొన్నాళ్లు వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది. తాను సరైనవాడ్నే పెళ్లి చేసుకున్నానని భావించిన ఆ అమ్మాయి.. చివరికి తన కుటుంబ సభ్యులకు పెళ్లి విషయం చెప్పింది. మొదట్లో ఖంగుతిన్నా, ఆ తర్వాత ఆమె కుటుంబీకులు వారి పెళ్లిని స్వాగతించారు. అప్పట్నుంచే ఆ అబ్బాయి తన నిజ స్వరూపం బయటపెట్టాడు. వింతగా ప్రవర్తించడమే కాదు, తాను వ్యాపారంలో చాలా కోల్పోయానని, తనకు డబ్బులు కావాలని అమ్మాయిని వేధించడం మొదలుపెట్టాడు. భర్తకు ఆర్థిక సహాయం అందిస్తే, తిరిగి వ్యాపారంలో నిలదొక్కుకుంటాడని ఆమె రూ. 15 లక్షల వరకూ ఇచ్చింది.
ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. పెళ్లై చాలాకాలం అయినా వీరి మధ్య లైంగిక సంబంధం లేదు. మొదటి రాత్రి నుంచే అమ్మాయిని అతడు దూరం పెడుతూ వచ్చాడు. తనకు కొంత సమయం కావాలని అడిగాడు. ఇప్పుడు డబ్బుల కోసం దూరం పెడుతున్నాడేమోననుకొని, అతనికి భారీ మొత్తం అందజేసింది. అయినా, రాత్రిళ్లు రూంలోకి రానివ్వలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆ అమ్మాయి, భర్తపై నిఘా పెట్టింది. చివరికి అతడు మగాడు కాదని తెలుసుకుంది. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి.. పోలీసుల్ని ఆశ్రయించింది. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే.. వీరికి పెళ్లి జరిగినట్టు చట్టపరమైన డాక్యుమెంట్స్ కూడా లేవు. ప్రస్తుతం ఈ కేసు స్థానిక కోర్టులో నడుస్తోంది.