Last Words Before D*eath: పుట్టినవారికి మరణం తప్పదు అన్నట్టుగా.. పుట్టిన ఏ జీవి అయినా మరణించక తప్పదు.. ప్రజలు రకరకాల కారణాలతో ప్రాణాలు విడిస్తారు.. కొందరు అనారోగ్య సమస్యలతో.. కొందరు ప్రమాదాల్లో.. మరికొందరు వృద్ధాప్య సమస్యలు.. ఇలా ఎన్నో రకాలుగా తనువు చాలిస్తారు.. మరణం అనేది ప్రకృతిలో అత్యంత అనివార్యమైన సత్యం. దాని గురించి మాట్లాడటానికి చాలా మంది భయపడతారు లేదా ఇష్టపడరు. కానీ, ఆసుపత్రుల్లోని ఐసీయూ (ICU) వార్డుల్లో పని చేసే నర్సులకు మరణం అనేది నిత్యం కనిపించే దృశ్యం. ఫ్లోరిడాకు చెందిన 29 ఏళ్ల నర్సు కిర్స్టీ రాబర్ట్స్, గత నాలుగేళ్లుగా వందలాది మంది రోగుల చివరి క్షణాలను దగ్గరుండి చూశారు. ఆమె పంచుకున్న అనుభవాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి..
* మరణానికి ముందు మాటలు.. ఆ 9 సంకేతాలు!
కిర్స్టీ వెల్లడించిన వివరాల ప్రకారం, మరణానికి చేరువలో ఉన్నప్పుడు దాదాపు ప్రతి రోగి పలికే మాటలు ఒకేలా ఉంటాయి. వైద్య పరికరాలు (Monitors) అన్నీ సాధారణంగా ఉన్నప్పటికీ, రోగికి తన అంత్యం సమీపించిందని ముందే తెలుస్తుందని ఆమె చెబుతున్నారు.
* మరణానికి ముందు వాళ్లు చెప్పే మాటలు ఇవే..
– “నా కుటుంబ సభ్యులను ప్రేమిస్తున్నానని చెప్పండి”.. ఆఖరి క్షణాల్లో ఆస్తిపాస్తులు కాదు, కేవలం అనుబంధాలే గుర్తుకు వస్తాయి.
– “నేను చనిపోతున్నానని నాకు తెలుసు” – రిపోర్టులు బాగున్నా, లోపల ప్రాణశక్తి తగ్గిపోతున్న విషయాన్ని వారు గ్రహిస్తారు.
– “ఎవరో నన్ను పిలుస్తున్నారు” – చనిపోయిన తమ బంధువులు లేదా దైవ స్వరూపాలు కనిపిస్తున్నట్లు చెబుతుంటారు.
– “నాకు బాగా లేదు.. అసౌకర్యంగా ఉంది” – శరీరం నుంచి ఆత్మ నిష్క్రమించే ముందు కలిగే మార్పు ఇది.
– “నన్ను క్షమించండి” – జీవితంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారు.
– “నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది” – భయం పోయి ఒక రకమైన నిశ్శబ్దం ఆవరిస్తుంది.
– “నన్ను గట్టిగా పట్టుకో” – తోడు కావాలని కోరుకుంటారు.
– “నేను వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను” – జీవితంపై మమకారాన్ని వదిలేసిన క్షణం.
– “ధన్యవాదాలు” – తమకు సేవ చేసిన వారికి కృతజ్ఞత తెలుపుతారని ఆమె వెల్లడించారు..
* వైద్య శాస్త్రానికి అందని ఆధ్యాత్మిక మార్పు
మెదడు మరణానికి ముందు శరీరానికి కొన్ని సంకేతాలను పంపుతుందని శాస్త్రవేత్తలు భావిస్తారు. కానీ కిర్స్టీ అభిప్రాయం ప్రకారం, ఇది కేవలం మెదడు రసాయనాల పని కాదు. మందులు పనిచేయడం మానేసి, ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్లే ముందు ఒక రకమైన “ఆధ్యాత్మిక పరివర్తన” జరుగుతుందని ఆమె నమ్ముతున్నారు. ఈ మార్పును యంత్రాలు కూడా గుర్తించలేవు. ఇక, రోగులతో బంధం ఏర్పరచుకోవడం, వారు వెళ్ళిపోయేటప్పుడు వీడ్కోలు చెప్పడం అత్యంత కష్టమని కిర్స్టీ అంటారు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని, చివరకు మనం ప్రతిదీ వదిలివెళ్లాల్సిందేనని ఆమె గుర్తు చేస్తున్నారు. అందుకే ఉన్నప్పుడే ఇతరులను ప్రేమించాలని, సహాయం చేయాలని, కృతజ్ఞతతో ఉండాలని ఆమె హితవు పలుకుతున్నారు.