మధ్యప్రాచ్యం యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. తాజాగా ఇరాన్లోని ఇస్ఫాహాన్లో 2,000 పౌండ్ల బంకర్-బస్టర్ బాంబును అమెరికా పేల్చింది. ఇరాన్లోని ప్రధాన నగరమైన ఇస్ఫహాన్లోని ముఖ్యమైన ఆయుధాగారంపై సుమారు 907 కిలోగ్రాముల బరువైన బంకర్-బస్టర్ బాంబులతో దాడి చేసింది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే లక్ష్యంగా దాడి చేసినట్లుగా చెబుతున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) ప్రకారం.. ఈ దాడిలో భారీ సంఖ్యలో పెనెట్రేటర్ మందుగుండు సామగ్రిని ప్రయోగించారని.. దీంతో భూగర్భ, పటిష్టమైన స్థావరాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అమెరికా అధికారి ధృవీకరించారు.
ఎకనామిక్ టైమ్స్లోని ఒక నివేదిక ప్రకారం.. ఇస్ఫహాన్లోని ప్రధాన ఆయుధాగారంపై అమెరికా 2,000 పౌండ్ల బంకర్-బస్టర్ బాంబులను ఉపయోగించిందని అధికారులు తెలిపారు. మార్చి 7-8 తేదీల్లో కూడా ఇదే ప్రదేశంపై అమెరికా దాడి చేసింది. మరోసారి విధ్వంసం సృష్టించడానికి బంకర్-బస్టర్ ఆయుధాలను ఉపయోగించింది.
అమెరికా రక్షణ అధికారుల ప్రకారం.. ఇస్ఫహాన్ ఆయుధాగారాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన బంకర్-బస్టర్ బాంబులను ఉపయోగించారు. భూమిలోపల చాలా లోతుగా నిర్మించిన కాంక్రీట్ నిర్మాణాలను ఛేదించగల సామర్థ్యం ఈ బాంబులకు ఉంది. ఇస్ఫహాన్లోని ఆయుధాగారాన్ని లక్ష్యంగా చేసుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే. దాడి అనంతరం ఆ ప్రాంతమంతటా భారీ పేలుళ్లు సంభవించాయి.
ఇదిలా ఉండగా దాడి జరిగిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇరాన్లోని ఇస్ఫాహాన్లో జరిగిన వరుస పేలుళ్ల వీడియోను తన ‘‘ట్రూత్ సోషల్’’ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశారు. వీడియోలో రాత్రి చీకటిలో మంటలు, ఆకాశం వైపు భారీ పొగ మేఘం ఎగసిపడటం స్పష్టంగా కనిపించింది. ఈ ఘటన మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
