US-Iran: 24 గంటల్లో శాంతి ఒప్పందం ఖరారు.. పాక్ ప్రధాని షరీఫ్ కీలక ప్రకటన

  • పశ్చిమాసియాలో శాంతి దిశగా అడుగులు
  • చివరి అంకానికి అమెరికా-ఇరాన్ చర్చలు
  • 24 గంటల్లో శాంతి ఒప్పందం ఖరారు
  • పాక్ ప్రధాని షరీఫ్ కీలక ప్రకటన
Us

Us

మొత్తానికి పాకిస్థాన్ చేసిన మధ్యవర్తిత్వం సత్‌ఫలితాన్ని ఇస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తోంది. ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు కూడా చేసింది. కానీ పంచాయితీ తెగలేదు. కానీ తాజాగా ఇరు పక్షాలు శాంతి ఒప్పందానికి ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎక్స్‌లో కీలక ప్రకటన చేశారు. మరో 24 గంటల్లో ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం ఖరారు కానుందని వెల్లడించారు.

అమెరికా-ఇరాన్ మధ్య నెలలుగా కొనసాగుతున్న శాంతి చర్చలు తుది దశకు చేరుకున్నాయని షెహబాజ్ షరీఫ్ అధికారికంగా వెల్లడించారు. మరో 24 గంటల్లోనే శాంతి ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఎక్స్ వేదికగా స్పందించిన షెహబాజ్ షరీఫ్.. ఇప్పటివరకు ఎప్పుడూ లేనంతగా రెండు దేశాలు ఒప్పందానికి చేరువయ్యాయని తెలిపారు. “శాంతి ఒప్పందానికి మేము ఎన్నడూ లేనంత దగ్గరగా ఉన్నాం. వచ్చే 24 గంటల్లో తుది రూపు దాల్చే అవకాశం ఉంది. ఒప్పందం ఖరారైన వెంటనే ఎలక్ట్రానిక్ సంతకాల ప్రక్రియకు పాకిస్థాన్ సిద్ధమవుతోంది. అనంతరం వచ్చే వారం సాంకేతిక స్థాయి చర్చలు జరగనున్నాయి” అని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.

×
×
Ad

అమెరికా, ఇరాన్‌కు కృతజ్ఞతలు

చర్చల ప్రక్రియలో నిబద్ధతతో వ్యవహరిస్తున్న అమెరికా, ఇరాన్ ప్రభుత్వాలకు షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రాంతీయ దేశాల సహకారాన్ని కూడా ప్రశంసించారు. “అమెరికా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ చర్చల సమయంలో చూపుతున్న సహనానికి, కట్టుబాటుకు ధన్యవాదాలు. ప్రాంతీయ దేశాల మద్దతును కూడా మేము అభినందిస్తున్నాం. ఈ చారిత్రాత్మక ఒప్పందం దీర్ఘకాలిక శాంతికి బలమైన పునాది అవుతుందని విశ్వసిస్తున్నాం” అని పేర్కొన్నారు.

తుది ముసాయిదాపై అంగీకారం?

ఇప్పటికే శాంతి ఒప్పందానికి సంబంధించిన తుది ముసాయిదాపై ఇరు దేశాల ప్రతినిధులు అంగీకారానికి వచ్చినట్లు షెహబాజ్ షరీఫ్ శుక్రవారం ప్రకటించారు. “తుది ఒప్పంద పాఠ్యంపై ఏకాభిప్రాయం కుదిరింది. తదుపరి చర్యలను ఖరారు చేసేందుకు పాకిస్థాన్ రెండు దేశాలతో కలిసి పనిచేస్తోంది. శాంతి ఇప్పటివరకు ఎన్నడూ ఇంత దగ్గరగా రాలేదు” అని తెలిపారు. అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం చేస్తూ పాకిస్థాన్ ఇటీవల కీలక పాత్ర పోషిస్తోంది. ప్రాంతీయ యుద్ధం మరింత విస్తరించకుండా నిలువరించేందుకు ఇస్లామాబాద్ దౌత్య ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఇరాన్ కూడా సంకేతాలు

ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి కూడా అమెరికాతో ఒప్పందం “ఎన్నడూ లేనంత దగ్గరగా ఉంది” అని వ్యాఖ్యానించారు. దీంతో చర్చలు తుది దశలోకి ప్రవేశించాయనే అంచనాలు మరింత బలపడ్డాయి. అయితే ప్రతిపాదిత ఒప్పందానికి సంబంధించిన అంశాలపై అమెరికా, ఇరాన్ వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఇరాన్ మీడియా కథనాల ప్రకారం:

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కొనసాగుతుంది.
యురేనియం శుద్ధీకరణ హక్కును ఇరాన్ వదులుకోదు.
ఇప్పటికే శుద్ధీకరించిన యురేనియం నిల్వలను కొనసాగిస్తుంది.

అయితే అమెరికా అధికారుల ప్రకారం

ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలి.
శుద్ధీకరించిన యురేనియం నిల్వలను ధ్వంసం చేయాలి.
హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలి.

ప్రతిపాదిత శాంతి ఒప్పందంలో..

ఇరాన్ అణు కార్యక్రమంపై పరిమితులు
ఆంక్షల సడలింపు
గల్ఫ్ ప్రాంతంలో సముద్ర భద్రత
హార్ముజ్ జలసంధి నిర్వహణ
ప్రాంతీయ స్థిరత్వం

అయితే ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక మార్గమైన హార్ముజ్ భవిష్యత్ నిర్వహణ ఈ చర్చల్లో ప్రధాన అంశంగా మారింది. ఇప్పటికీ అమెరికా, ఇరాన్ ప్రభుత్వాలు అధికారికంగా తుది ఒప్పందాన్ని ప్రకటించకపోయినా.. పాకిస్థాన్, ఇరాన్, అమెరికా నేతల తాజా వ్యాఖ్యలు చూస్తే శాంతి చర్చలు చివరి దశకు చేరుకున్నాయని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.