Site icon NTV Telugu

Russia Ukraine War: భారత్‌పై తీవ్ర ప్రభావం.. వీటి ధరలు పెరుగుతాయి..!

రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం రెండోరోజుకు చేరుకుంది.. ఇప్పటికే ఉక్రెయిన్‌ రాజధానిలోకి సైతం రష్యా బలగాలు ప్రవేశించాయి.. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకునేలా అడుగులు వేస్తోంది రష్యా.. ఇప్పటికే కొన్ని ఉక్రెయిన్‌ పరిపాలనా భవనాలపై రష్యా జెండాలు ఎగురుతున్నాయి.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్.. మరో 96 గంటల్లో రష్యా చేతిలోకి రాజధాని కీవ్ నగరం పూర్తిస్థాయిలో వెళ్లిపోతుందని తెలిపారు. అయితే, రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగితే.. ఆ ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.. ముఖ్యంగా కొన్నింటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Read Also: Bheemla Nayak: సినిమా కోసం ఎదురుచూస్తున్నా-నారా లోకేష్‌

రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం భారత్‌పై ఎలా పడుతుంది? వేటి ధరలు పెరుగుతాయనే విషయానికి వస్తే.. గతేడాది భారత్‌ 1.89 మిలియన్‌ టన్నుల పొద్దుతిరుగుడు పువ్వు నూనెను దిగుమతి చేసుకోవడం జరిగింది.. దీనిలో మెజార్టీ భాగం ఈ రెండు దేశాలదే.. 70 శాతం ఉక్రెయిన్‌, 20 శాతం రష్యా నుంచే దిగిమతి చేసుకోగా.. మరో 10 శాతం అర్జెంటీనా నుంచి తెచ్చుకుంది భారత్.. ఇప్పటికే ఉక్రెయిన్‌ నుంచి సరఫరా నిలిచిపోయింది.. ఇప్పటి పరిస్థితే మరో 2-3 వారాలు కొనసాగితే మనకు ఇబ్బంది తప్పదంటున్నారు.. మరోవైపు.. గోధుమలు ఎక్కువగా వినియోగించే దేశాల్లో భారత్‌ కూడా ఒకటి.. ఇదే సమయంలో ఎగుమతి చేసే దేశాల్లో రష్యా టాప్‌స్పాట్‌లో ఉంది.. గోధుమల నాలుగో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉక్రెయిన్‌ ఉంది.. కానీ, రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల వల్ల వీటి సరఫరా స్తంభిస్తే, గోధుమల ధరలు కూడా పెరిగే అవకాశం లేకపోలేదు.

ఇక, రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉన్న ఉద్రిక్తత ప్రభావం సెల్‌ఫోన్లపై కూడా పడే ప్రమాదం లేకపోలేదు.. ఎందుకంటే మొబైల్‌ ఫోన్ల తయారీలో వినియోగించే లోహం- పల్లాడియం అతిపెద్ద ఎగుమతిదారుగా రష్యా ఉండడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవాలి.. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో పల్లాడియం ధరలు ప్రియం అవుతాయని అంచనా వేస్తున్నారు.. మరోవైపు.. భారత్‌ నుంచి టీ అధికంగా కొనుగోలు చేసే దేశాల్లో రష్యా రెండో స్థానంలో నిలిచింది.. మన ఎగుమతుల్లో 18 శాతం ఆ దేశానికి వెళ్తుంటాయి.. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టీ ఉత్పత్తిదార్లు, ఎగుమతిదార్లు కలవరపడుతున్నారు.

Exit mobile version