హార్ముజ్ జలసంధి తెరుచుకోవడంపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చాలా సంతోషంగా ఉన్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధి తెరుచుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరాన్ కూడా ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హార్ముజ్ జలసంధి తెరుచుకోవడం లేదా త్వరలో పూర్తిగా అందుబాటులోకి రావడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారని ట్రంప్ తెలిపారు. చైనాలో జరగబోయే తమ సమావేశం ప్రత్యేకంగా.. చారిత్రాత్మకంగా ఉండే అవకాశముందని పేర్కొన్నారు. అధ్యక్షుడు జిన్పింగ్ను కలుసుకునేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని.. ఈ సమావేశంతో చాలా విషయాలు సాధ్యమవుతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అధ్యక్షుడు ట్రంప్ మే నెలలో చైనాలో పర్యటించనున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక దక్షిణాసియాకు రావడం ఇదే తొలిసారి. చైనాతో పాటు పాకిస్థాన్లో కూడా పర్యటించవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరితే సంతకాలు చేసేందుకు పాకిస్థాన్లో కూడా పర్యటిస్తానని ట్రంప్ పేర్కొన్నారు.
ఫిబ్రవరి 28న ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. ఖమేనీ సహా పలు కీలక నేతలంతా హతమయ్యారు. అనంతరం ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో చమురు, గ్యాస్ కష్టాలు తలెత్తాయి. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం సోమవారంతో ముగుస్తోంది.
ఇదిలా ఉంటే శాంతి ఒప్పందం కోసం గత శనివారం ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య చర్చలు జరిగాయి. 21 గంటల తర్వాత చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుతం మరోసారి చర్చల కోసం సోమవారం తిరిగి పాకిస్థాన్లో కలవనున్నారు. ఈ చర్చలైనా ఫలిస్తాయో లేదో చూడాలి.
