ఇరాన్తో యుద్ధం వేళ ట్రంప్ ప్రభుత్వంలో తిరుగుబాటు మొదలైంది. ట్రంప్ ప్రభుత్వంలోని ఉన్నతాధికారి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం అధిపతి జోసెఫ్ కెంట్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో సంచలన విషయాలు వెల్లడించారు. తన మనస్సాక్షికి విరుద్ధంగా ఇరాన్తో యుద్ధానికి మద్దతు ఇవ్వలేనని ప్రకటించారు. ఇజ్రాయెల్ ఒత్తిడితోనే ట్రంప్ ఇరాన్పై యుద్ధం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఇరాన్ నుంచి అమెరికాకు ఎలాంటి తక్షణ ముప్పు ఉండబోదని పేర్కొన్నారు.
పశ్చిమాసియా యుద్ధాలు అమెరికా ప్రాణాలను హరించి, దేశ సంపదను హరించివేస్తాయనే విషయం ట్రంప్కు 2025 జూన్ వరకు తెలుసని తన లేఖలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఉన్నతాధికారులు, అమెరికా మీడియాలోని ప్రభావవంతమైన సభ్యులు. ఒక తప్పుడు సమాచారం ద్వారా ఇరాన్తో యుద్ధాన్ని ప్రోత్సహించారని తెలిపారు. ట్రంప్పై ‘‘ఎకో ఛాంబర్’’ను ఉపయోగించారని కెంట్ ఆరోపించారు. ఇరాన్తో యుద్ధం ముగించుకుంటే మంచిదని.. లేదంటే దేశాన్ని మరింత గందరగోళంలోకి నెట్టగలరని అభిప్రాయపడ్డారు.
‘‘ఇరాన్లో మనం ఏమి చేస్తున్నామో.. ఎవరి కోసం చేస్తున్నామో మీరు పునరాలోచించాలని నేను ప్రార్థిస్తున్నాను. సాహసోపేతమైన చర్యలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం. మీరు మీ గమనాన్ని మార్చుకుని, మన దేశానికి ఒక కొత్త మార్గాన్ని నిర్దేశించవచ్చు. లేదా మమ్మల్ని మరింత పతనం.. గందరగోళం వైపు జారేలా చేయవచ్చు. అధికారం మీ చేతుల్లోనే ఉంది.’’ అని ట్రంప్ను ఉద్దేశించి కెంట్ రాశారు. ఇరాన్ యుద్ధం కారణంగా రాజీనామా చేసిన ట్రంప్ ప్రభుత్వంలోని మొదటి ప్రధాన అధికారి జోసెఫ్ కెంట్ కావడం విశేషం.
