Site icon NTV Telugu

Trump-Mojtaba: అమెరికాతో చర్చలపై మోజ్తాబా ఖమేనీ సంచలన నిర్ణయం.. నిజమేనా?

Irantrump

Irantrump

ఇరాన్‌పై యుద్ధానికి ట్రంప్ ఐదు రోజుల బ్రేక్ ఇచ్చారు. ఇరాన్‌తో సానుకూల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా యుద్ధానికి బ్రేక్ ఇచ్చినట్లుగా ట్రంప్ స్పష్టం చేశారు. కానీ ట్రంప్ ప్రకటనను ఇరాన్ ఖండించింది. అమెరికాతో ఎలాంటి చర్చలు లేవని తోసిపుచ్చింది.

అయితే తాజాగా అమెరికాతో చర్చలకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ సిద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఇరాన్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

రెండు దేశాల మధ్య సానుకూల చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ ప్రకటన తర్వాత ఇరాన్ నుంచి ఈ రకమైన వార్త రావడం ఒక విధంగా సానుకూల సంకేతంగా చెప్పుకోవచ్చు. అమెరికాతో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని.. ఇరాన్ షరతులకు అనుగుణంగా యుద్ధాన్ని ముగించేందుకు ఒక ఒప్పందానికి రావడానికి సిద్ధంగా ఉన్నానని మోజ్తాబా ఖమేనీ సూచించినట్లు మంగళవారం కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి.

ఇరాన్ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో మధ్యప్రాచ్య రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ నుంచి వచ్చిన పిలుపు మేరకు ఆదివారం చర్చలు జరిగినట్లుగా సమాచారం. 48 గంటల్లోగా హార్ముజ్ జలసంధి తెరవకపోతే ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ వార్నింగ్‌ల నేపథ్యంలో ఇరాన్ చర్చలకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్ తరపున మహమ్మద్-బఘేర్ ఘాలిబాఫ్ చర్చలకు నాయకత్వం వహిస్తున్నారని ‘ది జెరూసలేం పోస్ట్’ పత్రిక విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ తన నివేదికలో పేర్కొంది. అయితే ఘాలిబాఫ్ మాత్రం ఈ వాదనను తోసిపుచ్చారు. ‘‘అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదు. ఆర్థిక, చమురు మార్కెట్లను తారుమారు చేయడానికి, అలాగే అమెరికా, ఇజ్రాయెల్ చిక్కుకున్న చిక్కుముడి నుంచి బయటపడటానికి తప్పుడు వార్తలను ఉపయోగిస్తున్నారు.’’ అని పేర్కొన్నారు.

Exit mobile version