US-Iran Tensions: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా మిలిటరీ కార్యకలాపాలు ఇరాన్కు సమీపంలో పెరిగాయి. కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో యూఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అనుమతి కోసం వేచిచూస్తున్నాయి. అత్యాధునిక విమానాలు మిడిల్ ఈస్ట్కు చేరాయి. మరోవైపు, ఇరాన్ రష్యాలు కలిసి హార్మోజ్ జలసంధిలో యుద్ధ విన్యాసాలు ప్రారంభించాయి. కీలక లక్ష్యాలపైకి మిస్సైల్స్ ప్రయోగించింది.
Read Also: Neal Katyal: ట్రంప్నకు వ్యతిరేకంగా వాదించి గెలిచింది మనోడే..
ఇదిలా ఉంటే, ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ, ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీని లక్ష్యంగా చేసుకుని హతమార్చేందుకు అమెరికా ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ సైనిక ఆప్షన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు ఉంచినట్లు ఆక్సియోస్ నివేదిక తెలిపింది. మొజ్తాబాను సుప్రీంలీడర్ వారసుడిగా అంతా భావిస్తున్నారు. ఇరాన్ అగ్రనేతలతో పాటు కీలకమైన ముల్లాలనను అంతమొందించేలా రక్షణ శాఖ పలు ఆప్షన్లను ట్రంప్ ముందు ఉంచింది.
అయితే, దీనిపై ట్రంప్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ట్రంప్ నిర్ణయం తీసుకుంటే ఇరాన్పై అమెరికా దాడులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అధ్యక్షుడు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనే దానిపై స్పష్టత లేదని పెంటగాన్ వర్గాలు చెబుతున్నాయి. ఓ వైపు ఇరాన్తో అణు చర్చలు జరుపుతూనే అమెరికా సైనికంగా ఆ దేశంపై ఒత్తిడి తీసుకువస్తోంది. ప్రస్తుతం ఇరాన్ చుట్టు పక్కల 13 యుద్ధ నౌకల్ని అమెరికా మోహరించింది. ఇందులో USS అబ్రహం లింకన్, మరో శక్తివంతమైన జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఉన్నాయి.
