Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధం గురించి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో అమెరికన్ పైలట్ రెస్క్యూ ఆపరేషన్ గురించి రహస్య సమాచారం లీక్ కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లీక్ వెనక అమెరికా ప్రభుత్వంలోనే గూఢచారి ఉన్నారని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్పర్సన్ అసంతృప్తి రాగం..!
ట్రంప్ మాట్లాడుతూ.. ఈ లీక్ కారణంగా మొత్తం రెస్క్యూ ఆపరేషన్ ప్రమాదంలో పడిందని, ఇరాన్లో ఒక అమెరికన్ సైనికుడు చిక్కుకుపోయాడన్న విషయం బయటపడటం వల్ల పరిస్థితి క్లిష్టతరంగా మారిందని ట్రంప్ అన్నారు. ఈ సమాచారం ముందుగా ఇరాన్కు తెలియదని, ఈ లీక్ వల్ల శత్రువులకు లాభం చేకూరిందని అన్నారు. ఈ వార్తను ముందుగా బయటపెట్టిన మీడియా సంస్థపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో వెల్లడించకపోతే, సంబంధిత జర్నలిస్ట్ జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు సదరు జర్నలిస్ట్, మీడియా సంస్థ పేరు వెల్లడించలేదు. మొదటి పైలట్ను రక్షించిన తర్వాత, రెండో సైనికుడు కూడా ఉన్నాడనే విషయం ఈ లీక్ ద్వారా ఇరాన్కు తెలిసిందని ఆయన అన్నారు. ఈ వార్తను ముందుగా న్యూయార్క్ టైమ్స్, ఫాక్స్ న్యూస్, యాక్సియోస్ నివేదించాయి. పైలట్ను రక్షించడానికి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీ ఆపరేషన్ చేపట్టినట్లు ట్రంప్ తెలిపారు. రెస్క్యూ కోసం 155 విమనాలు, నాలుగు బాంబర్లు, 64 ఫైటర్లు, 48 ఇంధనాన్ని నింపే ట్యాంకర్లు, 13 రెస్క్యూ విమనాలు పాల్గొన్నట్లు ఆయన చెప్పారు.
