పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమయ్యాయి. ఉద్రిక్తతలు తగ్గుతాయని అనుకుంటే.. అనూహ్యంగా మళ్లీ పెరుగుతున్నాయి. గల్ఫ్ దేశాలు లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తుండగా.. ప్రతీకారంగా అమెరికా దాడులు చేయడంతో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. మధ్యప్రాచ్యం ఉద్రిక్తతలపై ప్రపంచ దేశాలు భయాందోళన చెందుతున్నాయి.
తాజాగా ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మధ్యప్రాచ్య రౌడీ ఇక చనిపోయాడు” అంటూ ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా-ఇరాన్ మధ్య తాజా సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ట్రంప్.. ఇరాన్ సైన్యం పూర్తిగా ఓడిపోయిందని.. వారి నౌకాదళం, వైమానిక దళ సామర్థ్యాలు దాదాపు నిర్వీర్యమయ్యాయని పేర్కొన్నారు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునే విషయంలో టెహ్రాన్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసిందని ఆరోపిస్తూ.. ఇప్పుడు దానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
“ఇరాన్ సైన్యం పూర్తిగా గందరగోళంలో ఉంది. వారు పూర్తిగా ఓడిపోయారు. ఇరాన్ మాటలు మాత్రమే చెబుతుంది.. చర్యలు ఉండవు. మధ్యప్రాచ్య రౌడీ ఇక చనిపోయాడు” అని ట్రంప్ తన పోస్టులో వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో ఇరాన్పై ట్రంప్ చేసిన అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలలో ఇది ఒకటిగా భావిస్తున్నారు.
కొన్ని గంటల ముందే ఇరాన్పై ట్రంప్ విమర్శలు గుప్పించారు. అమెరికాతో ప్రయోజనకరమైన ఒప్పందం చేసుకునే అవకాశాన్ని ఇరాన్ కోల్పోయిందని.. చర్చలు జరపడంలో చాలా ఆలస్యం చేసిందని అన్నారు. “వారికి ఎంతో ఉపయోగపడే ఒప్పందంపై నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం తీసుకున్నారు. ఇప్పుడు దానికి మూల్యం చెల్లించాల్సిందే” అని హెచ్చరించారు. ఇటీవల అమెరికా.. ఇరాన్కు చెందిన పలు సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులు నిర్వహించగా.. దానికి ప్రతిస్పందనగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లలో ఉన్న అమెరికా సైనిక కేంద్రాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

