Sri Lankan President thanks PM Modi: గత కొంత కాలంగా చైనాతో రాసుకుపూసుకు తిరిగిన శ్రీలంకకు భారత్ విలువ తెలుస్తోంది. రాజపక్సల హయాంలో భారత్ ను కాదని.. చైనాతో వ్యాపారం చేసి, భారీగా అప్పులు చేసిన శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోెభాన్ని ఎదుర్కొంటోంది. చైనా అప్పులు తీర్చలేక హంబన్ టోటా నౌకాశ్రయాన్ని 99 ఏళ్లకు లీజుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ కు ఇస్తామన్న ప్రాజెక్టులను కూడా చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసిన చరిత్ర రాజపక్సలది. అయితే సంక్షోభం సమయంలో చైనా కనీసం శ్రీలంకను పట్టించుకోలేదు. అసలు కష్టకాలంలో ఏ దేశం చేయని విధంగా పొరుగు శ్రీలంకకు భారత్ అన్ని విధాల సహయం చేసింది.
భారత్ చేసిన సాయాన్ని కొనియాడారు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే. భారత్ అందించిన ఆర్థిక సహాయాన్ని శ్రీలంకకు ‘ జీవన శ్వాస’గా అభివర్ణించారు. భారతదేశానికి, ప్రధాని నరేంద్ర మోదీకి రణిల్ విక్రమసింఘే బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ప్రారంభం అయిన శ్రీలంక పార్లమెంట్ సమావేశాల్లో ప్రజాప్రతినిధుల ముందు ఈ వ్యాఖ్యలు చేశారు అధ్యక్షుడు. ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం మాకు ప్రాణం పోసింది. శ్రీలంక ఆర్థిక పునరుద్దరణ కోసం భారత్ ఎంతో సహకరించిందని ఆయన అన్నారు. నాదేశం, నా ప్రజల తరుపున భారత్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. రణిల్ విక్రమ సింఘే అధ్యక్షుడు అయిన తర్వాత, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. శ్రీలంక ఆర్థిక పునరుద్ధరణకు, స్థిరత్వానికి భారత్ సహకరిస్తుందని అన్నారు.
Read Also: indian Medical Student in Philipines: ఫిలిప్పీన్స్ లో భారతీయ వైద్య విద్యార్థి కష్టాలు
ఇదిలా ఉంటే శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రజలు తీవ్ర ఆందోళనతో మాల్దీవులు, అక్కడ నుంచి సింగపూర్ పారిపోయాడు. దీంతో కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘేను ఎన్నుకున్నారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు దాదాపుగా 4 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించింది భారత్. ఇదిలా ఉంటే శ్రీలంక ప్రజలు అవసరాలను తీర్చేందుకు రానున్న ఆరు నెలల్లో 5 బిలియన్ డాలర్లు అవసరం అవుతాయని అంచానా. ఐఎంఎఫ్ ఆర్థిక ప్యాకేజీని శ్రీలంక కోరుతోంది. 1948లో స్వాతంత్య్రం పొందిన తర్వాత ఇలాంటి ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోవడం శ్రీలంకకు ఇదే తొలిసారి.