క్రమంగా సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది… ప్రతీ వ్యక్తి చేతిలో స్మార్ట్ఫోన్, అందులో డేటా ఉండడంతో.. అంతా సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులను లైక్లు, షేర్లతో ముంచెత్తుతున్నారు.. కొన్నిసార్లు.. అది తప్పుడు సమాచారం అయినా.. ఎక్కువ మంది షేర్ చేస్తూ పోతున్నారు.. అది ఫేక్ అని తెలిసే లోపే జరాగాల్సిన నష్టం జరిగిపోతోంది.. అయితే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్పై సంచలన వ్యాఖ్యలు చేవారు.. తప్పుడు సమాచారంతో ఫేస్బుక్.. ప్రజల్ని చంపేస్తోందని పేర్కొన్న ఆయన.. సోషల్ మీడియాలో వ్యాక్సినేషన్పై అనవసరమైన సమాచారం ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు ధ్వజమెత్తారు.. టీకాల పంపిణీపై సోషల్ మీడియాలో చాలా దారుణమైన రీతిలో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ ఆయన..ఫేస్బుక్ లాంటి ఫ్లాట్ఫామ్ల్లో.. వ్యాక్సిన్లు, మహమ్మారిపై తప్పుడు ప్రచారం సాగుతోందని దుయ్యబట్టారు.
కరోనాపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సినేషన్పై అమెరికాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది వైట్హౌస్ గుర్తించింది.. దీంతో.. వాటికి చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.. అయితే, సోషల్ మీడియా ప్రజల్ని చంపేస్తోందని, కేవలం వ్యాక్సిన్ వేసుకోనివారి వల్లే మహమ్మారి వ్యాపిస్తోందని.. ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నకు బదులిచ్చారు అమెరికా అధ్యక్షుడు బైడెన్.. ఇక, కరోనా మరణాలు, ఇన్ఫెక్షన్లు పెరుగుతున్న నేపథ్యంలో.. ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాల వల్ల.. వ్యాక్సినేషన్కు ఇబ్బందులు వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.. చాలా మందికి నమ్మకం కలగకపోవడం వల్లే వాళ్లు వ్యాక్సిన్లు వేసుకోవడం లేదని, దాంతో కావాల్సినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నా.. అమెరికన్లు వ్యాక్సిన్ల పట్ల విముఖత చూపిస్తున్నారని.. దీనికి ప్రధానకారణం సోషల్ మీడియాలో సాగుతున్న తప్పుడు ప్రచారమే కారణంగా భావిస్తున్నారు. అయితే, ప్రజలను రక్షించాలన్న ఉద్దేశంతోనే తాము సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నామని ఫేస్బుక్ అంటోంది.. అధ్యక్షుడు బైడెన్ చేసిన ఆరోపణలను ఖండించింది సోషల్ మీడియా దిగ్గజం.