Iran: ఎప్పుడైతే హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్పై దాడులు చేసిందో అప్పటి నుంచి మధ్యప్రాచ్యంలో నిత్యం రణరంగంగా మారింది. ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా ఇరాన్, హమాస్, హిజ్బుల్లా కలిసి పనిచేశాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఇరాన్ ఇజ్రాయిల్కి భారీ హెచ్చరికలు చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3లో భాగంగా ఇజ్రాయిల్ని నాశనం చేస్తామని ఇరాన్కి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) జనరల్ ఇబ్రహీం జబ్బారి నుండి తాజా హెచ్చరికలు వచ్చాయి.
‘‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 సరైన సమయంలో, ఖచ్చితత్వంతో ఇజ్రాయిల్ని నాశనం చేయడానికి, టెల్ అవీవ్-హైఫాలను నేలమట్టం చేయడానికి నిర్వహిస్తాము’’ అని మేజర్ జనరల్ జబ్బారి హెచ్చరించారు. ఈ బెదిరింపులకు ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి గిడియర్ సార్ స్పందించారు. ‘‘ యూదు ప్రజలు చరిత్ర నుంచి ఏదైనా నేర్చుకున్నారంటే అది ఇదే. మీ శత్రువు మిమ్మల్ని నానశం చేస్తామని చెబితే నమ్మంది- మేము అందుకు సిద్ధంగా ఉన్నాము’’ అని అన్నారు.
జబ్బారికి ముందు ఇజ్రాయిల్ని మరో ఇద్దరు ఇరాన్ అధికారులు ఇదే విధంగా బెదిరించారు. IRGC డిప్యూటీ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అలీ ఫడవి, IRGC యొక్క ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అమీర్ అలీ హజీజాదే కూడా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3లో భాగంగా ఇజ్రాయెల్ను నాశనం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఇదిలా ఉంటే, ఇటీవల కాలంలో ఇరాన్ తన క్షిపణి ఉత్పత్తిని పెంచినట్లు తెలుస్తోంది. దీని కోసం ఇరాన్ చైనా నుంచి 1000 టన్నుల రాకెట్ ఫ్యూయల్ని తెప్పించుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇరాన్ భూగర్భంలో సరికొత్త మిస్సైల్ సిటీని ఏర్పాటు చేసిందని పేర్కొంది. ఇజ్రాయిల్-అమెరికా కలిసి ఇరాన్లోని అణు కేంద్రాలపై సంయుక్త దాడికి ఇదే సరైన సమయమని పలువురు అమెరికన్-ఇజ్రాయిల్ నిపుణులు వాదిస్తున్నారు. బహుళ అణు బాంబుల్ని రూపొందించేందుకు తగినంత ఆయుధ గ్రేడ్ యురేనియంని ఇరాన్ ఉత్పత్తి చేసే దశలో ఉందని అమెరికన్-ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ (AIPAC)లో మాజీ పరిశోధన అధిపతి కాలిన్ విన్స్టన్ అన్నారు.