ప్రపంచంలో అన్ని యుద్ధాలు ముగుస్తున్నాయి గానీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ముగియడం లేదు. దాదాపుగా 4 ఏళ్ల నుంచి రెండు దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతూనే ఉంది. ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపినా యుద్ధం మాత్రం ఆగలేదు. ఇప్పటికీ భీకరంగా సాగుతూనే ఉంది. యుద్ధాలతో ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్నా ఇరు దేశాలు మాత్రం మెత్తబడలేదు. మొత్తానికి ఇన్నాళ్లకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దిగొచ్చి.. శాంతి చర్చల ప్రాతిపాదన చేశారు.
యుద్ధాన్ని ముగిద్దాం అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్కు జెలెన్స్కీ బహిరంగ లేఖ రాశారు. నేరుగా ముఖాముఖి చర్చలు జరపాలని ప్రతిపాదించారు. అయితే జెలెన్స్కీ లేఖను పుతిన్ పరిశీలించినట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. అమెరికా ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతి ప్రయత్నాలు నిలిచిపోయిన నేపథ్యంలో.. అలాగే ప్రపంచ దృష్టి ఇరాన్ సంక్షోభం వైపు మళ్లిన సమయంలో జెలెన్స్కీ ఈ లేఖను విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
జెలెన్స్కీ ప్రతిపాదన ఏమిటి?
సుమారు 1,800 పదాలతో కూడిన ఈ లేఖలో జెలెన్స్కీ నేరుగా పుతిన్తో సమావేశం కావాలని ప్రతిపాదించారు. ‘‘ఈ యుద్ధాన్ని మనిద్దరి మధ్య నేరుగా చర్చల ద్వారా ముగిద్దాం. మీతో సమావేశం కావాలని ప్రతిపాదిస్తున్నాను.’’ అని జెలెన్స్కీ పేర్కొన్నారు. చర్చల కోసం స్విట్జర్లాండ్, టర్కీ లేదా ఏదైనా అరబ్ దేశాన్ని తటస్థ వేదికగా ఎంచుకోవచ్చని సూచించారు. చర్చలు జరిగేంత కాలం పూర్తిస్థాయి కాల్పుల విరమణ అమల్లో ఉండాలని కోరారు. అలాగే ఇరు దేశాల మధ్య ఉన్న యుద్ధ ఖైదీలందరినీ పరస్పరం విడుదల చేసుకోవాలని, యుద్ధం కారణంగా నిరాశ్రయులైన పౌరులు, పిల్లల తిరిగి పంపకంపై కూడా చర్చించాలని ప్రతిపాదించారు.
ఇప్పుడే ఎందుకు?
ప్రస్తుతం రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక జరుగుతోంది. ఈ సందర్భంగా జెలెన్స్కీ ఈ లేఖను విడుదల చేశారు. అంతేకాకుండా ప్రపంచ దృష్టి ప్రస్తుతం ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలపై కేంద్రీకృతమైందని, యూరప్ యుద్ధంపై మళ్లీ దృష్టి పడే వరకు వేచి ఉండటం సరైనది కాదని పేర్కొన్నారు. రష్యాలో పెరుగుతున్న ధరలు, ఇంధన కొరత, దీర్ఘకాలిక యుద్ధ ప్రభావం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందని కూడా జెలెన్స్కీ వ్యాఖ్యానించారు.
పుతిన్పై విమర్శలు
ఇక లేఖలో జెలెన్స్కీ అసాధారణంగా వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా చేశారు. ఉక్రెయిన్-రష్యా సంబంధాలను యుద్ధం, విధ్వంసం దిశగా మళ్లించారని పుతిన్పై ఆరోపించారు. ‘‘26 ఏళ్లుగా అధికారంలో ఉన్న నేపథ్యంలో వయసు ప్రభావం కనిపించడం ప్రారంభమైంది.’’ అంటూ విమర్శలు గుప్పించారు. అలాగే రష్యా సైన్యం పూర్తి స్థాయిలో డోనెత్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోలేదని, భవిష్యత్తులో కూడా అది సాధ్యం కాదని పేర్కొన్నారు.
రష్యా స్పందన ఏమిటి?
ప్రస్తుతం రష్యా ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు. అయితే పుతిన్కు లేఖ అందినట్లు క్రెమ్లిన్ ధృవీకరించింది. రష్యా ఇప్పటివరకు స్పష్టం చేసిన దాని ప్రకారం.. నేరుగా శిఖరాగ్ర సమావేశం జరగాలంటే ముందుగా ప్రధాన అంశాలపై ఒప్పందం కుదరాలి. అలాగే రష్యా ఆక్రమించిన భూభాగాలను ఉక్రెయిన్ అంగీకరించాలని, NATOలో చేరే ప్రయత్నాలను విరమించుకోవాలని మాస్కో డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ మాత్రం తన సార్వభౌమాధికారం, భద్రతకు ఎలాంటి భంగం కలగకుండా ఉండే ఒప్పందానికే అంగీకరిస్తామని స్పష్టం చేస్తోంది.
ప్రధాన వివాదాలివే..
రెండు దేశాల మధ్య సందేశాల మార్పిడి జరిగినప్పటికీ కీలక అంశాలపై విభేదాలు కొనసాగుతున్నాయి. భూభాగాల విషయంలో రష్యా తన వైఖరిని మార్చలేదు. అదే సమయంలో ఉక్రెయిన్ కూడా తన భూభాగాన్ని వదులుకునే ప్రసక్తే లేదని చెబుతోంది. దీంతో జెలెన్స్కీ ప్రతిపాదించిన ప్రత్యక్ష చర్చలు శాంతి దిశగా కొత్త అవకాశాలను తెరుస్తాయా? లేక మరో దౌత్య ప్రయత్నంగానే మిగిలిపోతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.

