Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం నాడు ఐరోపా నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వారు పంది పిల్లలు అంటూ ఎద్దేవా చేశారు. రష్యా ఏదోక రోజు నాటో కూటమి దేశాలపై కూడా దాడి చేస్తుందనే అనవసర భయాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి మద్దతు తెలపకపోతే.. ఉక్రెయిన్ లోని మరిన్ని భూ భాగాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించాడు. రష్యా రక్షణ శాఖ వార్షిక సమావేశాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: IPL 2026లో MS Dhoniని కంటే ఎక్కువ డబ్బు సంపాదించే 8 మంది సీఎస్కే ప్లేయర్స్ వీళ్లే..?
ఈ సందర్భంగా మాస్కో అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. రష్యా దళాలు అన్ని వైపుల నుంచి ఉక్రెయిన్లోకి చొచ్చుకెళ్తున్నాయని పేర్కొన్నారు. దౌత్యం లేదా బలప్రయోగంతోనైనా చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రదేశాలకు ఉక్రెయిన్ నుంచి విముక్తి కల్పిస్తామని వెల్లడించారు. అమెరికా ప్రతిపాదిక శాంతి ఒప్పందంపై పురోగతి లేకపోవడంతో పుతిన్ ఈ హెచ్చరికలు చేశారు. అలాగే, యుద్ధం ముగింపు దిశగా యూఎస్ ఇటీవల రష్యాతో పాటు ఉక్రెయిన్, ఐరోపా నేతలతో వేర్వేరుగా చర్చలు కొనసాగించింది. కానీ, శాంతి ఒప్పందంలో భాగంగా తన భూభాగాలు కోల్పోవాల్సి రావడంపై ఉక్రెయిన్తో పాటు ఇతర యూరోపియన్ దేశాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ భద్రతకు మరిన్ని రక్షణలు కావాలని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ పట్టుబడుతున్నాడు. పాశ్చాత్య దేశాల ఒత్తిడి ఉన్నప్పటికీ తాము మాత్రం తమ ప్రణాళికలతో యథావిధిగా ముందుకు కొనసాగుతామని వ్లాదిమిర్ పుతిన్ తేల్చి చెప్పారు.
Read Also: Trump-White House: జో బైడెన్ చెత్త అధ్యక్షుడు.. వైట్హౌస్లో అధ్యక్షుల చిత్రపటాల కింద రాతలు
ఇక, రష్యా రక్షణ శాఖ మంత్రి ఆండ్రె బెలోసోవ్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది దాడుల తీవ్రత మరింత పెంచుతామని వార్నింగ్ ఇచ్చారు. ఈ ఏడాది దేశ జీడీపీలో 5.1 శాతం మొత్తాన్ని యుద్ధానికి కేటాయించామని పేర్కొన్నారు. అలాగే, అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. క్రిమియాతో పాటు ఉక్రెయిన్లోని సుమారు 19 శాతం భూభాగం ప్రస్తుతం రష్యా ఆధీనంలోకి వెళ్లిపోయింది. డోన్బాస్, ఖెర్సన్, జెపోరిజియా ప్రాంతాలు అనేకం మాస్కో ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఇవన్నీ ఇకపై తమ భూభాగాలే అని రష్యా ఇప్పటికే ప్రకటించుకున్నా ఉక్రెయిన్ మాత్రం ఈ వాదనలను ఖండించింది.