POK killings: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(POK)లోని ప్రజలు తమ హక్కుల కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రావల్కోట ప్రాంతంలో నిరసనల్ని అణిచివేయడానికి పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరిపింది. కాల్పుల్లో కనీసం 30 మంది మరణించినట్లు, 200 మందికి పైగా గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై యూకేలోని కాశ్మీరీ ప్రవాసులు పాకిస్తాన్ కాన్సులేట్ ముందు నిరసన చేపట్టారు. బ్కాడ్ఫోర్డ్ సిటీలో మంగళవారం(జూన్ 09)న కాశ్మీరీ నిరసనకారులు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పీఓకేలో శాంతియుతంగా జరుగుతున్న నిరసనలపై కాల్పులు జరిపారని వారంతా ఆరోపించారు.
ఇదే సమయంలో పాకిస్తాన్ పరిస్థితులపై 30 మంది బ్రిటిష్ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. వీరంతా పీఓకే ఘటనలపై యూకే విదేశాంగ శాఖకు లేఖ రాశారు. ఈ ఎంపీకు బ్రాడ్ఫోర్డ్ ఈస్ట్ ఎంపీ ఇమ్రాన్ హుస్సేన్ నేతృత్వం వహించారు. పీఓకేలో అరెస్టులు, కమ్యూనికేషన్ నిలిపివేత, మానవ హక్కుల ఉల్లంఘనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యూకే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఎంపీలు కోరారు.
పీఓకే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(JAAC) పీఓకే నిరసనలకు నేతృత్వం వహిస్తోంది. ప్రజలకు సబ్సిడీ ధరలకు పిండి, చౌక విద్యుత్ ఇవ్వాలని, ప్రాంతీయ అసెంబ్లీలో కాశ్మీర్ ప్రవాసులకు కేటాయించిన 12 రిజర్వ్ స్థానాలను రద్దు చేయడంతో పాటు 38 డిమాండ్ల అమలు కోసం ఈ ఉద్యమం నడుస్తోంది. గతంలో కూడా చాలా సార్లు ఇలాగే పీఓకే ప్రజలు పాక్ ప్రభుత్వం, ఆర్మీకి వ్యతిరేకం ఆందోళనలు, నిరసనలు నిర్వహించారు.

