Pak’s Sindh govt orders high-level probe as abducted Hindu girl: పాకిస్తాన్ లో ఇటీవల కిడ్నాపుకు గురైన 14 ఏళ్ల హిందూ బాలిక ఆచూకీ ఇంకా తెలియలేదు. దీంతో పాకిస్తాన్ సింధు ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. సింధు ప్రావిన్సులోని హైదరాబాద్ నగరంలోని ఫతే చౌక్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో బాలికను కిడ్నాప్ చేశారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సింధ్ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.
హైదరాబాద్ మరియు మీర్పూర్ఖాస్ లో గత వారం కిడ్నాపులకు గురైన ఇద్దరు హిందూ బాలికల ఘటనలకు సంబంధించి విచారణ జరుపుతున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. గత 15 రోజుల్లో నలుగురు హిందూ బాలికలు, యువతులు కిడ్నాపులకు గురయ్యారు. కిడ్నాప్ తరువాత బలవంతంగా పెళ్లి చేసి, మతం మారుస్తున్నారు. ముఖ్యంగా సింధ్ ప్రావిన్సులో ఈ కిడ్నాపుల ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. రెండు నెలల క్రితం ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుకు చెందిన ఓ సిక్కు మహిళా ఉపాధ్యాయురాలిని ఇలాగే కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుని మతం మార్చారు. ఈ ఘటనపై పాకిస్తాన్ లో ఉన్న సిక్కులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
Read Also: Cabinet Meeting: రైల్వే ఉద్యోగులకు బోనస్.. చమురు మార్కెటింగ్ కంపెనీలకు వన్ టైం గ్రాంట్
సెప్టెంబర్ 24న మీనా మేఘ్వాల్ం అనే 14 ఏళ్ల బాలిను నాసర్ పూర్ ప్రాంతంలో కిడ్నాప్ చేశారు. మిర్పుర్ఖాస్ పట్టణంలో ఇంటికి తిరిగివస్తుండగా మరో బాలికను కిడ్నాప్ చేశారు. అదే పట్టణంలో రవీ కుర్మీ అనే హిందూ వ్యక్తి భార్య రాఖీని కిడ్నాప్ చేసి ముస్లిం మతానికి చెందిన వ్యక్తితో వివాహం చేసి, బలవంతంగా మతం మార్చారు. సదరు మహిళకు అప్పటికే పెళ్లై ఇద్దరు సంతానం ఉన్నారు.
ఇటీవల కిడ్నాపుకు గురైన ఓ బాలిక స్థానిక కోర్టులో మాట్లాడుతూ.. తనను వివాహం చేసుకున్న ముస్లిం వ్యక్తి బలవంతంగా కిడ్నాప్ చేసి, మతాన్ని మార్చాడాని వెల్లడించింది. అంతకుముందు సుక్కూర్ పట్టణంలో హిందూ యువతి పెళ్లికి నిరాకరించడంతో ముస్లిం వ్యక్తి కాల్చి చంపాడు. పాకిస్తాన్ లో మైనారిటీలు అయిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులపై తరుచు దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా బాలికలను స్త్రీలను టార్గెట్ చేస్తున్నారు. పలు అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ లో మైనారిటీ హక్కుల గురించే మాట్లాడే పాకిస్తాన్.. తన దేశంలోని మైనారిటీలను పట్టించుకోవడం లేదు.