Pakistan train hijack: పాకిస్తాన్ ట్రైన్ హైజాక్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మనం చాలా సార్లు విమానాలు, ఓడలు, బస్సులు హైజాక్ కావడాన్ని చూశాం. అయితే, రైలును హైజాక్ చేయడం అనేది చాలా కఠినం, అలాంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ), బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్ వెళ్తున్న రైలును హైజాక్ చేశారు. ముఖ్యంగా, పర్వతాలు, టన్నెల్స్ నుంచి వెళ్లే మార్గంలో, మారుమూల ప్రాంతాన్ని ఎంచుకుని పక్కా ప్లాన్లో హైజాక్ చేశారు. 400 మంది కన్నా ఎక్కువ ప్రయాణికుల్ని బందీలుగా పట్టుకున్నారు. బందీలను విడిపించేందు పాక్ ఆర్మీ దాదాపుగా 36 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చింది. మొత్తం, ప్రయాణికుల్ని విడిపించామని, 30 కన్నా ఎక్కువ మంది మిలిటెంట్లను చంపేశామని పాకిస్తాన్ ఆర్మీ చెబుతోంది. మరోవైపు, బీఎల్ఏ ఇందుకు విరుద్ధంగా 100 మందికి పైగా పాక్ ఆర్మీ సిబ్బందిని చంపేసినట్లు పేర్కొంటోంది.
ప్రపంచానికి తెలిసేలా చేసింది..
పాకిస్తాన్ తమ ప్రాంతానికి చేస్తున్న అన్యాయాన్ని, తమ హక్కులను కాలరాస్తున్న విధానాన్ని బీఎల్ఏ ప్రపంచం ముందుంచాలని ఈ హైజాక్ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. రైలు హైజాక్ అయిన అంశం అంతర్జాతీయంగా మీడియాలో ప్రముఖంగా నిలిచింది. దీంతో అసలు, ఈ బలూచిస్తాన్ మూమెంట్ ఏమిటి..? వీరు ఎందుకు దాడులు చేస్తున్నారనే అంశాలపై ఇంటర్నేషనల్ మీడియా విస్తృతంగా కథనాలు ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే, బలూచిస్తాన్ వివాదాన్ని బీఎల్ఏ అంతర్జాతీయ సమాజం ముందు ఉంచింది.
ఇదే సమయంలో తాము ఇస్లామిక్ ఉగ్రవాదులతో పోలిస్తే చాలా భిన్నమనే విషయాన్ని కూడా వెల్లడించింది. ట్రైన్ హైజాక్ తర్వాత మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులను విడిచిపెట్టి, తాము వారికి చాలా భిన్నమనే విషయాన్ని వెల్లడించింది. కేవలం పాక్ ఆర్మీ, ఐఎస్ఐ సిబ్బందితో పాటు తమ వనరుల్ని దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్న పంజాబ్ ప్రావిన్స్ ప్రజలను మాత్రమే బందీలుగా చేసుకుంది.
పాక్ నిఘా వైఫల్యం, ఆర్మీ బలాలు బట్టబయలు..
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మీల్లో ఒకటి, అణ్వాయుధ సత్తా ఉందని ప్రగల్భాలు పలికే పాకిస్తాన్కి బీఎల్ఏ సవాల్ విసిరింది. మేము తలుచుకుంటే పాక్ ఆర్మీని కూడా దెబ్బతీయగలమనే సందేశాన్ని ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే పాక్ ఆర్మీలో భయాన్ని పుట్టించింది. ముఖ్యంగా పాక్ ఆర్మీలో ఎక్కువగా పంజాబ్ డామినేషన్ ఉంటుంది. మిగతా ప్రాంతాల వారికి సరైన ప్రాతినిధ్యం ఉండదు. అందుకే బీఎల్ఏ పంజాబ్ ప్రజల్ని టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు వారంతా బలూచిస్తాన్లో పనిచేయాలంటే భయపడేలా చేసింది.
పాక్ నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఐఎస్ఐ వంటి సుశిక్షిత గూఢచార సంస్థ ఉన్నప్పటికీ, బీఎల్ఏ ముందు వారి పప్పులు ఉడకలేదు. ట్రైన్ హైజాక్ అయిన దాదాపుగా 36 గంటల తర్వాత మాత్రమే రెస్క్యూ విజయవంతమైందని స్వయంగా పాక్ ఆర్మీ ప్రకటించింది. దీనిని బట్టి చూస్తే దాని బలహీనతల్ని బీఎల్ఏ ఎత్తిచూపింది.
చైనా, పాకిస్తాన్ బహిర్గతం..
1948 నుంచి తమ ప్రాంతం ఎలా అణచివేతకు గురవుతుంది, తమ ప్రాంత ప్రజలపై పాకిస్తాన్ చేస్తున్న అకృత్యాలను బీఎల్ఏ ఈ హైజాక్ ద్వారా ప్రపంచానికి తెలిసేలా చేసింది. పాక్ ఆప్తమిత్రుడు చైనాను కూడా ప్రపంచం ముందు నిలబెట్టింది. బలూచిస్తాన్ ప్రావిన్సులో ఉన్న సహాజవాయువు, విలువైన ఖనిజ సంపదనను పాక్, చైనాలు కలిసి దోచుకుంటున్నాయనే విషయాన్ని అంతర్జాతీయ సమాజం ముందు బీఎల్ఏ ఉంచింది. బలూచిస్తాన్లో గ్వాదర్ పోర్ట్, చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) ద్వారా సంపదను దోచుకుంటున్నాయనే వాదనను బీఎల్ఏ ముందుకు తెచ్చింది. బీఎల్ఏ ఫైటర్స్ ఒక వీడియో మెసేజ్లో పాకిస్తాన్, చైనాలు తమ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని వార్నింగ్ ఇవ్వడం వైరల్ అయింది.