Site icon NTV Telugu

Pak-Afghan War: రంజాన్ వేళ ఆప్ఘన్‌పై పాక్ వైమానిక దాడులు.. భారీగా ప్రాణనష్టం!

Pakafghanwar

Pakafghanwar

రంజాన్ మాసం చివరి దినాల్లో ఆప్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల్లో ఆప్ఘనిస్థాన్‌లోని కాబుల్, కందహార్, పక్తియా, పక్తికా వంటి ప్రదేశాల్లో భారీ నష్టం జరిగింది. మహిళలు, పిల్లలు చనిపోయారని ఆప్ఘనిస్థాన్ తెలిపింది. నివాసాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో ఈ నష్టం జరిగినట్లుగా పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను పాకిస్థాన్ ఖండించింది. మొత్తానికి తాజా ఘటనతో ఇస్లామాబాద్-తాలిబన్ ప్రభుత్వం మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.

ఇక కాందహార్‌లోని ఇంధన డిపోపై కూడా పాకిస్థాన్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇది పౌర విమానయాన సంస్థలకు, ఐక్యరాజ్యసమితి విమానాలకు ఇంధనాన్ని సరఫరా చేస్తుంది. ఇప్పటికే ప్రపంచమంతా పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో పాకిస్థాన్ మాత్రం కాందహార్ ఇంధన డిపో దాడి చేయడంతో మరింత ఉద్రిక్తతలు పెరిగేటట్లు కనిపిస్తోంది. అనేక నివాసాలు నేలమట్టం అయ్యాయి.

పాకిస్థాన్ సైనిక చర్యను క్రూరమైన దురాక్రమణగా తాలిబన్ ప్రభుత్వం అభివర్ణించింది. రంజాన్ చివరి పది రోజుల్లో ఈద్ వంటి పండుగలకు దగ్గరగా ఉన్న సమయంలో దాడులు చేయడం పాకిస్థాన్ పాలన ఎటువంటి మానవతా సూత్రాలకు.. నైతిక విలువలకు కట్టుబడి లేదని నిరూపిస్తుందని ప్రకటనలో పేర్కొంది. కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఆఫ్ఘన్ ప్రతినిధి ప్రతిజ్ఞ చేశారు.

Exit mobile version