మానవుడి నాగరికత, టెక్నాలజీ భూమికి ప్రమాదాన్ని తీసుకువస్తోంది. తాజాగా సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోన్ లేయర్ కు భారీ రంధ్రాన్ని సైంటిస్టులు గుర్తించారు. గతంలో అంటార్కిటికా ప్రాంతంలో గుర్తించిన దాని కన్నా ఇది 7 రెట్లు పెద్దదిగా ఉన్నట్లు కెనడాలోని వాటర్లు యూనివర్సిటీ శాస్త్రవేత్త క్వింగ్ బిన్ లూ వెల్లడించారు. ఈ రంధ్రం దిగువ స్ట్రాటో ఆవరణంలో ఏర్పడినట్లు గుర్తించారు. కొత్తగా కనుగొనబడిన ఈ ఓజోన్ హోల్ గత 30 ఏళ్లుగా ఉష్ణమండలంపై ఉన్నట్లు వెల్లడించారు.
సాధారణంగా ఓజోన్ అంటే మూడు ఆక్సిజన్ అణువుల సమ్మేళనంగా (ఓ3). ఇది సూర్యుడి నుంచి వచ్చే ఆల్ట్రా వయోలెట్ కిరణాల నుంచి భూమిని, భూమిపై జీవరాశిని రక్షిస్తోంది. భూమి ఎగువ వాతావరణంలో ఒక పొరలా ఉండీ భూమిని రక్షిస్తోంది. కొన్ని కారణాల వల్ల ఈ పొరకు రంధ్రాలు ఏర్పడుతున్నాయి. సాధారణంగా రంధ్రాలు అంటే ఆ ప్రాంతంలో ఓజోన్ లేకపోవడం అని చెప్పవచ్చు. గడిచిన కొన్ని దశాబ్ధాలుగా ఓజోన్ లేయర్ పలుచబడిపోతుందని సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు.
Read Also: Rajya Sabha: పెద్దల సభకు నలుగురు దక్షిణాది ప్రముఖులు..
ఓజోన్ క్షీణతకు ప్రధాన కారణం క్లోరోఫ్లోరో కార్బన్స్(సిఎఫ్సి). కూలింగ్ యూనిట్లలో ప్రధానంగా ఈ గ్యాస్ వాడుతారు. ముఖ్యంగా ఏసీలు, ఫ్రిజ్ లలో ఈ గ్యాస్ వాడతారు. వీటి నుంచి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్స్ ఓజోన్ లేయర్ క్షీణతకు కారణం అవుతున్నాయి. ఈ క్లోరోఫ్లోరో కార్బన్ లతో ఓజోన్ గ్యాస్ రసాయనిక చర్య వల్ల ఆక్సిజన్, క్లోరిన్ వాయువులు ఏర్పడుతాయి. ఫలితంగా ఓ3 వాయవు ఆ ప్రాంతంలో ఉండదు. దీంతో సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకర కిరణాలు భూమిపై పడుతాయి.
ఓజోన్ పొర క్షీణత వల్ల యూవీ రేడియేషన్ పెరుగుతుంది. ఫలితంగా ఇది చర్మ క్యాన్సర్లకు, కంటిపై ప్రభావానికి కారణం అవుతుంది. దీంతో పాటు మానవుడి వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యవసాయ పంటల ఉత్పాదకతను తగ్గిస్తుంది. జలచర జీవులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.