Kim Jong Un: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఒక వేళ హత్యకు గురైతే ప్రళయం సృష్టిస్తామని ఆ దేశం చెబుతోంది. ఒక నివేదిక ప్రకారం.. విదేశీ దాడిలో తమ నాయకుడు కిమ్ హత్యకు గురైనా, అశక్తుడైనా ఆటోమెటిక్గా అణుదాడి చేయాలని ఉత్తరకొరియా ఒక కొత్త అణు విధానాన్ని తీసుకుంది. మార్చి 22న రాజధాని ప్యాంగ్యాంగ్ లో జరిగిన ఉత్తరకొరియా 15వ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ మొదటి సమావేశంలో ఈ రాజ్యంగ సవరణను ఆమోదించినట్లు ‘‘ ది టెలిగ్రాఫ్’’ నివేదించింది.
కొత్తగా సవరించిన చట్టం ప్రకారం, దేశ అణ్వాయుధాలపై కిమ్ జోంగ్ ఉన్న ఆధిపత్యం కొనసాగుతుంది, కానీ ఆయనను లక్ష్యంగా చేసుకుంటే ప్రతీకారం ఎలా ఉంటుందనేది కొత్త నిబంధనలు నిర్వచిస్తున్నాయి. ‘‘శత్రు దేశాల దాడుల వల్ల దేశ అణ్వాయుధాలపై ఉణ్న కమాండ్ కంట్రోల్ వ్యవస్థకు ప్రమాదం వాటిల్లితే, ఆటోమెటిక్గా, తక్షణమే అణు దాడి జరుగుతుంది’’ అని ఉత్తర కొరియా తన అణు విధాన చట్టంలో ఆర్టికల్ 3లో పేర్కొన్నట్లు నివేదిక చెబుతోంది.
ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ, పలువురు సీనియర్ నాయకులు ఇజ్రాయిల్, అమెరికా దాడుల్లో చనిపోయిన నేపథ్యంలో ఉత్తరకొరియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియా రాజకీయాలను అధ్యయనం చేస్తున్న రాజకీయ విశ్లేషకులు ప్రకారం.. ఉత్తర కొరియాలో గతంలో కూడా ఈ నిబంధనలు ఉండీ ఉండొచ్చని, కానీ ఇప్పుడు రాజ్యాంగంలో చేర్చడం ద్వారా దీనికి మరింత ప్రాముఖ్యత కల్పించినట్లైందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, నిగూఢ దేశంగా ఉన్న ఉత్తర కొరియాలో గూఢచార ఆపరేషన్స్ సాధ్యం కావని చెబుతున్నారు. ఉత్తరకొరియాలోని విదేశీ ప్రముఖులు, రాయబారులపై కూడా నిఘా ఉంటుందని చెబుతున్నారు. అయినప్పటికీ, ఇరాన్ పరిణామం ఉత్తరకొరియాకు ఒక డేంజర్ సిగ్నల్ పంపిందని అంటున్నారు.
