Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్పై భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా దాడులు చేసింది. ఈ దాడుల్లో పీఓకే, పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద స్థావరాలు, ప్రధాన కార్యాలయాలు, ట్రైనింగ్ క్యాంపుల్ని ధ్వంసం చేసింది. ఇందులో ముఖ్యంగా పీఓకేలోని మురిద్కే ఉన్న లష్కరే తోయిబా కార్యాలయం, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోని బహవల్పూర్లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్ర కార్యాలయాలను భారత్ ధ్వంసం చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ బహవల్పూర్లోని జైష్-ఎ-మొహమ్మద్ (JeM) మార్కజ్ సుభాన్ అల్లా ప్రధాన కార్యాలయం ధ్వంసం చేయడం ఆపరేషన్ సిందూర్లోనే హైలెట్గా నిలిచింది. భారత్ 2025 మే 7న చేసిన దాడిలో జైష్ చీఫ్ మసూద్ అజార్ బంధువులు కూడా మరణించారు.
ఇదిలా ఉంటే దాడులు జరిగిన 15 నెలల తర్వాత జైష్ మళ్లీ తన కార్యాలయాన్ని పునర్నిర్మించుకుంది. గతేడాది మేలో భారత దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న ఈ కాంపౌండ్కు కొత్త మార్బుల్, పెయింట్, ప్లాస్టర్ వేశారు. దెబ్బతిన్న గోపురాలను కూడా తిరిగి నిర్మించారు. ప్రధాన హాల్లోని దాడుల ఆనవాళ్లను తొలగించి భవనాన్ని పునరుద్ధరించారు.
జైషే కార్యాలయం నిర్మాణానికి పాకిస్తాన్ ప్రభుత్వం స్వయంగా 25 కోట్ల పాక్ రూపాయాలను అందించినట్లు తెలుస్తోంది. ఇందులో సుమారు 11 కోట్ల రూపాయల్ని ప్రధాన హాల్ పునర్నిర్మాణానికి ఖర్చు చేసినట్లు సమాచారం. ఇదే కాకుండా ప్రధాన కాంప్లెక్స్ను ఆనుకుని ఉన్న మద్రసా అల్ సబీర్, జైషే కమాండర్ల నివాస ప్రాంతాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇక్కడ కొత్త నిర్మాణ పనులు జరుగుతున్నట్లు సమాచారం.
మార్కజ్ సుభాన్ అల్లా అంతర్జాతీయ సరిహద్దు నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. 18 ఎకరాల్లో విస్తరించిన ఈ కాంప్లెక్స్ను ఉస్మాన్-ఓ-అలీ క్యాంపస్ అని కూడా పిలుస్తారు. ఇందులో మసీదుతో పాటు జైష్ కార్యకలాపాలకు సంబంధించిన పలు సౌకర్యాలు ఉన్నాయి. నిజానికి పాక్ ప్రభుత్వం 2002లో జైషే మహ్మద్ను నిషేధించినప్పటికీ, ఆ సంస్థ దేశంలో కార్యకలాపాలు సాగిస్తోంది. 2001 పార్లమెంట్ దాడి, 2016 పఠాన్కోట్ ఎయిర్బేస్ దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి దాడులను జైషే మహ్మద్ నిర్వహించింది.

