Iran – Israel: మిడిల్ ఈస్ట్లో (మధ్యప్రాచ్యం) యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయి. ఇరాన్పై మూడోసారి దాడి జరుగుతుందా? అనే కొత్త భయం ప్రపంచ దేశాలను వణికించేలా చేస్తోంది. గతంలో అమెరికా, ఇరాన్లోని మూడు అణు ప్లాంట్లపై బాంబుల వర్షం కురిపించగా, ఈ ఏడాది ఫిబ్రవరి 28న రెండో విడత భీకర దాడులు జరిగాయి. దీనికి ఇరాన్ కూడా గట్టిగానే బదులిచ్చింది. ప్రస్తుతం అమెరికాతో కుదిరిన తాత్కాలిక ఒప్పందంతో ఇరాన్లో శాంతి నెలకొన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. లోలోపల మూడో రౌండ్ విధ్వంసానికి స్క్రిప్ట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
నెతన్యాహు ‘సిక్రెట్ ప్లాన్’..
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజాగా చేసిన ప్రకటన ఇరాన్లో మళ్లీ వణుకు పుట్టిస్తోంది. “మా సైన్యం ఇప్పటికే రెండుసార్లు ఇరాన్లోకి దూసుకెళ్లి దాడులు చేసింది. అవసరమైతే మూడోసారి కూడా దాడి చేయడానికి వెనుకాడం. నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ చేతికి అణు ఆయుధాలు రానివ్వను” అని నెతన్యాహు ఘాటుగా హెచ్చరించారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కూడా ఇరాన్పై మూడో దాడి తప్పదనే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్కు వ్యతిరేకంగా ఒక పెద్ద సైనిక ఆపరేషన్కు రెడీ అవుతున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ఓ నివేదికలో వెల్లడించింది. ఒకవేళ ఇరాన్ కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, టెహ్రాన్పై మళ్లీ బాంబుల వర్షం కురిపించాలని టాప్ అఫీషియల్స్తో ట్రంప్ చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ఇదే సమయంలో ఇరాన్తో అణు కార్యక్రమంపై చర్చలు జరపడానికి కూడా ట్రంప్ అనుమతించారు.
ఆ రెండు అంశాలు..
‘హోర్ముజ్ జలసంధి’ పూర్తిగా తెరవకపోవడం, అలాగే అణు కార్యక్రమంపై అమెరికా షరతులకు ఇరాన్ లొంగకపోవడం అనే రెండు వివాదాలు అమెరికా-ఇరాన్ మధ్య వివాదానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఇవే మళ్లీ యుద్ధానికి ట్రిగ్గర్ పాయింట్లుగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇజ్రాయెల్, అమెరికాల హెచ్చరికలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘిర్ ఖలీబాఫ్ స్పందిస్తూ.. “మేము శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ అవి విఫలమైతే యుద్ధానికి మేము కూడా సిద్ధమే” అని తేల్చి చెప్పారు. ఒకవేళ ఇరాన్పై మూడోసారి దాడి జరిగితే ఆ సెగ ప్రపంచం మొత్తానికి తగలనుంది. ప్రస్తుతం బ్యారెల్కు 72 డాలర్లుగా ఉన్న ముడి చమురు ధర ఏకంగా 150 డాలర్లకు చేరుకుంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఇదే కనుక జరిగితే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోవడంతో పాటు ‘మహా ద్రవ్యోల్బణం’ రావడం ఖాయమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

