Indonesia: ‘నా డీఎన్‌ఏలో భారతీయ రక్తం ఉంది’.. ఇండోనేషియా అధ్యక్షుడి వ్యాఖ్యలకు మోడీ హర్షధ్వానాలు

  • నా డీఎన్‌ఏలో భారతీయ రక్తం ఉంది
  • ఇండోనేషియా అధ్యక్షుడి వ్యాఖ్యలకు మోడీ హర్షధ్వానాలు
  • కోట్లాది భారతీయుల హృదయాలను గెలుచుకుందని వ్యాఖ్య
Indonesian

Indonesian

ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జకార్తాలోని భారతీయ ప్రవాసుల సభలో మాట్లాడిన వ్యాఖ్యలు భారతీయులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తన డీఎన్‌ఏ పరీక్షలో భారతీయ మూలాలు ఉన్నట్లు తేలిందని వెల్లడించగా.. సభలో ఉన్న భారతీయులు హర్షధ్వానాలతో స్వాగతించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ.. ‘‘మీ ఒక్క మాట కోట్లాది భారతీయుల హృదయాలను గెలుచుకుంది’’ అంటూ ప్రశంసించారు.

జకార్తాలో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి మాట్లాడిన ప్రబోవో సుబియాంటో.. భారత పర్యటనకు ముందు తాను జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్ష చేయించుకున్నట్లు తెలిపారు. ‘‘భారత్‌కు అధికారిక పర్యటనకు వెళ్లే ముందు నేను డీఎన్‌ఏ పరీక్ష చేయించుకున్నాను. అందులో నాకు భారతీయ డీఎన్‌ఏ ఉన్నట్లు తెలిసింది. అందుకే భారతీయ సంగీతం వినిపించిన ప్రతిసారీ నా శరీరం తనంతట తానే కదలడం ప్రారంభిస్తుంది’’ అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలతో సభలోని భారతీయులు చప్పట్లు, హర్షధ్వానాలతో స్పందించారు. అంతేకాకుండా తన మంత్రివర్గంలోని పలువురు మంత్రులు, సైనికాధికారులు కూడా భారతీయ సంగీతాన్ని ఎంతో ఇష్టపడతారని పేర్కొంటూ.. ‘‘బహుశా వాళ్లకూ భారతీయ డీఎన్‌ఏ ఉండొచ్చు’’ అని సరదాగా వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు పూశాయి.

ఇండోనేషియా అధ్యక్షుడు భారత్‌తో తమ దేశానికి ఉన్న చారిత్రక, సాంస్కృతిక అనుబంధాన్ని కూడా ప్రస్తావించారు. ఇండోనేషియా సంస్కృతి, నాగరికతపై భారతీయ నాగరికత ప్రభావం ఎంతో ఉందని పేర్కొన్నారు. ‘‘మా నాగరికత, సంస్కృతి భారత నాగరికత ప్రభావంతో బలంగా రూపుదిద్దుకుంది. మా భాషలో దాదాపు 50 శాతం పదాలు సంస్కృతం నుంచి వచ్చాయి. మా దేశంలోని అనేక పేర్లు కూడా సంస్కృత మూలాలవే. భారత్ నుంచి మేము ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి.’’ అని ప్రబోవో అన్నారు.

మోడీ స్పందన

ప్రబోవో వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇదే విషయం చెప్పారని గుర్తు చేస్తూ.. ‘‘మీరు అప్పుడూ ఇదే చెప్పారు.. ఈరోజూ అదే చెప్పారు. మీరు భారత డీఎన్‌ఏ ఉందని చెప్పినప్పుడు సభలో అత్యధిక చప్పట్లు వినిపించాయి.’’ అని అన్నారు. ‘‘మీ ఆ ఒక్క వ్యాఖ్య కోట్లాది భారతీయుల మనసులను గెలుచుకుంది. అది కేవలం డీఎన్‌ఏ కాదు.. పరస్పర విశ్వాసానికి ప్రతీక. ఉమ్మడి వారసత్వానికి నిదర్శనం.’’ అని మోడీ పేర్కొన్నారు. ఇండోనేషియా భారత్‌కు నిజమైన మిత్రదేశమని, తన పర్యటనకు చూపిన ఆతిథ్యం, గౌరవానికి అధ్యక్షుడు ప్రబోవోకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు.

కాగా ఈ కార్యక్రమానికి ముందు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో.. భారత్-ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసినందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీకి ఇండోనేషియాలో అత్యున్నత పౌర పురస్కారమైన ‘‘బింటాంగ్ రిపబ్లిక్ ఇండోనేషియా ఆదిపుర్ణ’’ను ప్రదానం చేశారు.