భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లో నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది పాక్.. ఆ దేశ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడడం.. అదే సమయంలో ఉగ్రవాదులు చొరబడడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. అయితే, ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొడుతూనే వస్తోంది ఇండియన్ ఆర్మీ.. అయితే, పాక్ నుంచి డ్రోన్ల చొరబాటును ఇవాళ గట్టిగా నిలదీసింది భారత్.. సరిహద్దు ఉల్లంఘనలను నియంత్రించాలని సూచించింది.
భారత్, పాక్ అంతర్జాతీయ సరిహద్దులోని ఆక్ట్రాయ్ వద్ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), పాకిస్థాన్ రేంజర్స్ మధ్య కమాండెంట్ స్థాయి సమావేశం నిర్వహించారు.. సరిహద్దులో స్తంభాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, కార్యకలాపాలు, పాకిస్థాన్ డ్రోన్ కార్యకలాపాలు, ఇతర వ్యవహారాలపై ఇరు దేశాల సరిహద్దు రక్షణ దళ కమాండర్లు చర్చించారు.. ఈ భేటీలో సరిహద్దుల నుంచి పాక్ డ్రోన్ల చొరబాటును బీఎస్ఎఫ్ ప్రస్తావించడంతోపాటు గట్టిగా నిలదీసింది. మరోవైపు, బీఎస్ఎఫ్ రక్షణ నిర్మాణ పనులపై పాక్ రేంజర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.. అన్ని సరిహద్దు సమస్యలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవాలని అంగీకారానికి వచ్చారు.