పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నారు. తన ఆరోగ్యం క్షీణిస్తోందని, జైలు పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని పేర్కొంటూ, వైద్య, మానవతా కారణాలతో తన విడుదలను కోరుతూ ఇస్లామాబాద్ హైకోర్టును అభ్యర్థించారు. ఇమ్రాన్ ఖాన్ తరఫు న్యాయవాది సల్మాన్ సఫ్దర్ కోర్టుకు తెలిపారు.. “ఇమ్రాన్ ఖాన్ కంటిచూపు కేవలం 15 శాతం మాత్రమే మిగిలి ఉంది. అంటే ఆయన దృష్టిలో 85 శాతం కోల్పోయారు.” ఈ సమస్య శాశ్వతమైనదని, వైద్యులు కూడా దీన్ని కోలుకోలేని పరిస్థితిగా అభివర్ణించారని న్యాయవాది వాదించారు. ఇస్లామాబాద్ హైకోర్టులో జరిగిన విచారణలో, జైలులో సుదీర్ఘకాలం ఏకాంత నిర్బంధం కంటి సమస్యల కారణంగా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని న్యాయవాది తెలిపారు.
ఆదియాలా జైలులో తగిన వైద్య సౌకర్యాలు లేకపోవడం వల్ల ఆయనను అనేకసార్లు ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని కూడా పేర్కొన్నారు. న్యాయవాది సల్మాన్ సఫ్దర్ మరిన్ని అంశాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీను ఎందుకు ఏకాంత నిర్బంధంలో ఉంచుతున్నారో వివరణ కోరారు. పంజాబ్ జైళ్ల ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, ఆదియాలా జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్లను కోర్టు ముందు హాజరుపరచాలని అభ్యర్థించారు. ఇమ్రాన్ ఖాన్ పూర్తి వైద్య రికార్డులను ఆసుపత్రి నుంచి కోర్టుకు సమర్పించాలని డిమాండ్ చేశారు.
విచారణ సందర్భంగా, ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సర్దార్ ముహమ్మద్ సర్ఫరాజ్ డోగర్ ప్రధాన అప్పీల్పై దృష్టి పెట్టాలని సూచించారు. అయితే, శిక్ష నిలుపుదల పిటిషన్పై ముందుగా నిర్ణయం తీసుకోవాలని ఇమ్రాన్ తరఫు న్యాయవాది పట్టుబట్టారు. దీంతో కోర్టు విచారణను వాయిదా వేసింది. ఇమ్రాన్ ఖాన్ ఆయన భార్య బుష్రా బీబీ అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసు (190 మిలియన్ పౌండ్ల అవినీతి కేసు)లో శిక్షలు అనుభవిస్తున్నారు. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) ఆరోపణల ప్రకారం, బ్రిటన్ నుంచి వచ్చిన డబ్బును ప్రభుత్వ ఖజానాలో జమ చేయకుండా, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త జరిమానాలు చెల్లించడానికి ఉపయోగించి, ప్రతిఫలంగా ఖాన్ ట్రస్ట్కు విలువైన భూములు బహుమతిగా అందుకున్నారని ఆరోపించారు.
