ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతూనే వుంది. అమెరికా వంటి దేశాల్లో కేసులు 8 లక్షల వరకూ వుండడం ఆందోళన కలిగించాయి. తాజాగా అన్ని దేశాల్లోనూ కరోనా కేసులు తీవ్రంగా వచ్చిపడుతున్నాయి. దీంతో విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా పసిఫిక్ దీవుల్లోని కొన్నిదేశాల్లో ఇప్పటిదాకా అక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కానీ, ఒమిక్రాన్ పుణ్యమా అని వేరే దేశాల నుంచి వచ్చినవారితో అక్కడ తొలిసారి కేసులు నమోదయ్యాయి.
దీంతో కిరిబాటి, సమోవ వంటి దేశాల్లో తాజాగా కేసులు బయటపడడంతో ఇవాళ లాక్ డౌన్ విధించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం కిరిబాటిలో ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.. సమోవాలో కేవలం రెండంటే రెండే కేసులు వచ్చాయి. అయినా ఆ దేశాలు కరోనా వైరస్ తమ దేశ పౌరుల ఆరోగ్యరీత్యా లాక్ డౌన్ విధించడం హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు ఓకే చెప్పాక ఫిజి నుంచి కిరిబాటికి వచ్చిన వారిలో డజన్ల కొద్దీ ప్యాసింజర్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. బ్రిస్బేన్ నుంచి ప్రజలను తీసుకొచ్చిన రీపాట్రియేషన్ విమానంలోని 15 మందికి కరోనా వచ్చింది. దీంతో ఆ రెండు దేశాలూ లాక్ డౌన్ ను ప్రకటించాయి.
ప్రస్తుతం వచ్చిన కేసులన్నీ ఒమిక్రాన్ కేసులే అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమోవా ప్రధాని ఫియామి నవోమీ మతాఫా దీనిపై స్పందించారు. విదేశాల నుంచి తమ దేశం వచ్చినవారిలో అందరూ క్వారంటైన్ లోనే ఉన్నారని, సోమవారం రాత్రికి ఆంక్షలను ఎత్తేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆమె అన్నారు. ఇక, కిరిబాటిలో సమూహ వ్యాప్తి మొదలు కావడం, ఒక కేసు రావడంతో రాజధానిలో ఆంక్షలు విధించామని కిరిబాటి అధ్యక్షుడు తానేటి మామూ చెప్పారు. ఆహారం, ఆరోగ్యం వంటి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలన్నారు.