స్పానిష్ యుద్ధంలో మునిగిన రెండు నౌకలను కొలంబియా అధికారులు గుర్తించారు. 300 ఏళ్లుగా సముద్ర గర్భాన దాగున్న శాన్జోస్ అనే యుద్ధనౌకలోని అపార సంపదతో జాడ ఎట్టకేలకు దొరికింది. కార్టజినా తీరానికి సమీపంలో దీన్ని కనుగొన్నట్లు కొలంబియా నేవీ ప్రకటించింది. 1708లో బ్రిటీష్ దాడిలో శాన్జోస్ యుద్ధ నౌక మునిగిపోయింది. అయితే ఆ నాటి తెరచాప నౌక శిథిలాలను గుర్తించారు. ఆ నౌకల్లో తరలించిన సుమారు 1.32 లక్షల కోట్ల (17 బిలియన్ల డాలర్ల) విలువైన బంగారు నాణేలు, మట్టి, పోర్సెలిన్ పాత్రలు ఉన్నట్లు తాజాగా కనుగొన్నారు. ఈ రెండు పడవలూ 200 ఏళ్ల నాటివని వాషింగ్టన్ పోస్టు ప్రకటించింది.
ఒక రిమోట్ ఆధారిత నావను సముద్ర గర్భంలోకి సుమారు 3,100 అడుగుల లోతులోకి పంపి ప్రధాన ఓడ శాన్జోస్ శిథిలాల వద్ద ఉన్న ఆ పడవలను వీడియో తీయించారు. వాటిలో బంగారు నాణేలు, పోర్సెలిన్ పాత్రలు ఉన్నట్లు నిర్ధరణ అయింది. శాన్జోస్ ఓడను 2015లో కనుగొన్నారు. స్పానిష్ సక్సెసన్ యుద్ధంలో బ్రిటీష్ నౌకలు జరిపిన దాడిలో శాన్జోస్ నౌక నీట మునిగింది. స్పెయిన్ రాజు ఫిలిప్–5కు చెందిన ఈ నౌకలో సుమారు 600 మంది ఉన్నారు. వారితో పాటు బంగారు నాణాలు, ఆభరణాలు, ఇంకా బంగారు సామాగ్రి ఉన్నాయి. అయితే అప్పటి నౌకా దళానికి చెందిన రెండు ఓడల శిథిలాలను ఇప్పుడు గుర్తించారు. దీనిపై తమకే హక్కులున్నాయంటూ కొలంబియా అంటుండగా స్పెయిన్, ఒక అమెరికా కంపెనీతోపాటు, బొలీవియా ఆదివాసులు కూడా పోటీకి వస్తున్నారు.