Israel-Iran War: మేడ్ ఇన్ చైనా వ్యవస్థలు ఎలా ఉంటాయో మరోసారి ప్రపంచానికి తెలిసొచ్చింది. గతంలో భారత్ పాకిస్తాన్పై నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ సమయంలో మన క్షిపణుల్ని పాకిస్తాన్లో మోహరించిన చైనీస్ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేకపోయాయి. ఇటీవల, ఆఫ్ఘాన్పై పాక్ దాడి చేసిన తర్వాత, తాలిబన్లు పాక్ రాజధాని ఇస్లామాబాద్పై డ్రోన్ దాడి చేశారు. ఈ సమయంలో కూడా చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వీటిని పసిగట్టలేకపోయాయి.
తాజాగా, ఇరాన్ను కూడా చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను నమ్ముకుని ఘోరంగా దెబ్బతింది. ఇజ్రాయిల్, యూఎస్లు యథేచ్ఛగా మిసైల్స్, ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నా చైనా తయారీ HQ-9B రక్షణ వ్యవస్థ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఇజ్రాయిల్ సృష్టించిన విధ్వంసానికి ఇరాన్ టాప్ లీడర్ షిప్ మరణించారు. ఏకంగా సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ హతమయ్యాడు.
చైనా HQ-9B మళ్లీ విఫలం, ఇరాన్లో విధ్వంసం:
ఇరాన్ చైనా నుంచి కొనుగోలు చేసిన HQ-9B గగనతల రక్షణ వ్యవస్థ విఫలమైనట్లు తెలుస్తోంది. తమ ఆస్తుల్ని రక్షిస్తుందని ఇరాన్ ఎంతో నమ్మకంతో కొనుగోలు చేసిన ఈ వ్యవస్థ చివరకు ఇజ్రాయిల్, యూఎస్ దాడుల ముందు చేతులెత్తేసింది. వస్తున్న గగనతల ముప్పును తటస్థీకరించలేకపోయింది. 260 కి.మీ దూరంలోని లక్ష్యాలను, 50 కి.మీ ఎత్తులో ఉన్న విమానాలను కూల్చగలదని చైనా చెబుతోంది. కానీ రియల్ టైమ్లో చేతులెత్తేస్తోంది. ఇది ఒకేసారి 100 లక్ష్యాలను గుర్తించి, 6-8 క్షిపణుల్ని అడ్డుకోగల సామర్థ్యం ఉందని చెబుతుంటారు.
ఇరాన్లోని నటాంజ్ అణు కేంద్రం, ఫోర్డో యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్, ముఖ్యమైన మిసైల్ బేస్ల వద్ద వీటిని మోహరించినప్పటికీ అక్కడ భారీ నష్టం వాటిల్లింది. అమెరికా, ఇజ్రాయిల్ క్షిపణులు వేగం, ఆధునాతన సాంకేతికత ముందు చైనా వ్యవస్థలు నిలవలేదని యుద్ధరంగ నిపుణులు భావిస్తున్నారు.