China: చైనాలో మరోసారి కోవిడ్-19 కేసులు పెరుగుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2026లో తొలిసారిగా కరోనా వైరస్ వ్యాప్తి ఇన్ఫ్లుయెంజాను దాటేసి అత్యంత వేగంగా వ్యాపిస్తున్న శ్వాసకోశ వ్యాధిగా నమోదైంది. అయితే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మంది బాధితులకు స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని, గత ఏడాది పరిస్థితులతో పోలిస్తే ఈసారి వైరస్ ప్రభావం తక్కువగానే ఉందని చైనా ఆరోగ్య అధికారులు వెల్లడించారు.
జూన్లో 79 వేల కొత్త కేసులు
చైనా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (CDC) వెల్లడించిన వివరాల ప్రకారం.. జూలై 13 నుంచి 19 వరకు నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్-19 పాజిటివిటీ రేటు 16.3 శాతానికి చేరుకుంది. ఇది అంతకుముందు వారంతో పోలిస్తే 4.3 శాతం పాయింట్లు ఎక్కువ. అదే సమయంలో ఫ్లూ పాజిటివిటీ రేటు 12.6 శాతంగా నమోదైంది. జూన్ 2026లో దేశవ్యాప్తంగా 79 వేల కొత్త కరోనా కేసులు నమోదవగా, వాటిలో 130 మంది పరిస్థితి విషమంగా మారింది. ఈ కాలంలో ఒక మరణం మాత్రమే నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం చైనాలో ఒమిక్రాన్కు చెందిన NB.1.8.1 వేరియంట్ ప్రధానంగా వ్యాపిస్తున్నట్లు సీడీసీ తెలిపింది. ఈ వేరియంట్ వ్యాప్తి సామర్థ్యం మధ్యస్థంగా ఉందని, ప్రస్తుతం ప్రజారోగ్యానికి అధిక ప్రమాదం కలిగించే కొత్త వేరియంట్లు ఏవీ గుర్తించలేదని అధికారులు పేర్కొన్నారు.
భయపడాల్సిన అవసరం ఉందా..
కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మందికి జ్వరం, గొంతునొప్పి, అలసట వంటి స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని, సాధారణంగా ఐదు నుంచి ఏడు రోజుల్లో కోలుకుంటున్నారని తెలిపారు. తీవ్రమైన కేసులు లేదా మరణాల్లో అసాధారణ పెరుగుదల లేదని, ప్రస్తుతం నమోదవుతున్న ఇన్ఫెక్షన్ రేటు 2025లో నమోదైన కరోనా వేవ్ కంటే బలహీనంగానే ఉందని వెల్లడించారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చైనా సీడీసీ సూచించింది. రద్దీ ప్రాంతాలు, ఆసుపత్రుల్లో మాస్కులు ధరించాలని, అవసరమైతే బూస్టర్ డోసులు తీసుకోవాలని సూచించింది.
గతంలో కరోనా, ఫ్లూ కేసులు ప్రధానంగా చలికాలంలో పెరిగేవి. అయితే ఇప్పుడు వేసవిలో కూడా కేసులు పెరుగుతున్నాయి. తీవ్ర ఎండల కారణంగా ప్రజలు ఎక్కువసేపు ఏసీ గదుల్లో గడపడం, వేసవి సెలవుల్లో ప్రయాణాలు పెరగడం వైరస్ వ్యాప్తికి అనుకూల పరిస్థితులు సృష్టిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. చైనాలో కేసులు పెరుగుతున్నప్పటికీ భారతదేశంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్తో పాటు కొన్ని రాష్ట్రాల్లో చెదురుమదురు కేసులు నమోదైనప్పటికీ, బాధితుల్లో ఎక్కువ మందికి స్వల్ప లక్షణాలే ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం పెద్ద ముప్పుకు ఎలాంటి సంకేతాలు లేవని అధికారులు చెబుతున్నారు. అయితే చైనాలో తాజా పరిణామాల నేపథ్యంలో పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య శాఖలు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి.

