China: సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధ (AI) సాంకేతికతల భద్రత, జాతీయ ప్రయోజనాల పరిరక్షణ నేపథ్యంలో చైనా కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. అత్యాధునిక AI టెక్నాలజీలు, సెమీకండక్టర్ చిప్ డిజైన్లు, సంబంధిత సాంకేతికతల ఎగుమతిపై మరింత కఠినమైన నిబంధనలు తీసుకురావాలని చైనా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రపంచ టెక్నాలజీ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏఐ టెక్నాలజీలపై కఠిన నియంత్రణకు చైనా సిద్ధం
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. చైనా ప్రభుత్వం దేశంలోని ప్రముఖ AI కంపెనీలైన అలీబాబా, బైట్డాన్స్, జిపు తదితర సంస్థలతో చర్చలు జరుపుతోంది. అత్యాధునిక AI మోడళ్లను వ్యూహాత్మక జాతీయ ఆస్తిగా పరిగణిస్తూ, వాటి సాంకేతికత దేశం వెలుపలకు వెళ్లకుండా పరిమితులు విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శిక్షణ (Training) డేటాను విదేశాలకు బదిలీ చేయడంపై నియంత్రణలు, విదేశీ వినియోగదారులు AI మోడళ్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశాలపై పరిమితులు వంటి అంశాలు కూడా చర్చల్లో ఉన్నట్లు సమాచారం. దీని ద్వారా చైనా అభివృద్ధి చేసిన సాంకేతికత ఇతర దేశాలకు సులభంగా చేరకుండా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు ఈ నివేదికలు పేర్కొంటున్నాయి.
క్వాల్కామ్, టీఎస్ఎంసీ వంటి విదేశీ చిప్ తయారీ సంస్థలు చైనా రూపొందించిన డిజైన్ల ఆధారంగా ఉత్పత్తి చేయకుండా కొత్త మార్గదర్శకాలు తీసుకురావచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. చైనా తన సెమీకండక్టర్ డిజైన్లపై పూర్తి నియంత్రణ కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం AI, సెమీకండక్టర్ టెక్నాలజీల ఎగుమతిపై ఎలాంటి అధికారిక నిషేధం ప్రకటించలేదు. అయితే, ఎగుమతి నియంత్రణ జాబితాలో ఈ టెక్నాలజీలను చేర్చే అవకాశాన్ని చైనా పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు సూచిస్తున్నాయి. ఇలాంటి ఆంక్షలు అమల్లోకి వస్తే రక్షణ, ఆటోమొబైల్, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, AI పరిశ్రమలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే అత్యాధునిక సెమీకండక్టర్ తయారీలో ప్రస్తుతం తైవాన్, దక్షిణ కొరియా, అమెరికా ముందంజలో ఉండగా, చైనా ప్రధానంగా చిప్ ప్యాకేజింగ్, కొన్ని ప్రత్యేక విభాగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవలే చైనా హీలియం ఎగుమతులపై పరిమితులు విధించిన నేపథ్యంలో, ఇప్పుడు AI, చిప్ టెక్నాలజీలపై కూడా కఠిన నిబంధనలు తీసుకురావచ్చనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నిర్ణయాలపై అధికారిక ప్రకటన వెలువడితే ప్రపంచ టెక్ మార్కెట్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

