ముంబై ఉగ్ర దాడి నిందితుడు తహవ్వూర్ రాణాకు కెనడా షాక్ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అతడి పౌరసత్వం రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇది కూడా చదవండి: AI Summit: ఢిల్లీ ఏఐ సమ్మిట్లో న్యూసెన్స్ సృష్టించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరెస్ట్
కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఫిబ్రవరి 26న భారత్ పర్యటనకు వస్తున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు తిరిగి బలపడనున్నాయి. గత ప్రధాని జస్టిన్ ట్రూడో కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మార్క్ కార్నీ ప్రధాని అయ్యాక తిరిగి సంబంధాలు బలపడ్డాయి. ఇక మార్క్ కార్నీ భారత్ పర్యటనకు రాకముందే 26/11 ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారి తహవ్వూర్ హుస్సేన్ రాణా పౌరసత్వాన్ని రద్దు చేయడానికి కెనడా ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: The Paradise: నాని కోసం రూల్స్ బ్రేక్ చేశాను.. శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ ట్వీట్!
తహవ్వూర్ రాణా (65) పాకిస్థాన్లో జన్మించిన వ్యాపారవేత్త. ప్రస్తుతం భారతదేశంలో నిర్బంధంలో ఉన్నాడు. పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా నిర్వహించిన ముంబై ఉగ్రవాద దాడులతో సంబంధాలు ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. 2008లో జరిగిన ఉగ్ర దాడిలో 160 మందికి పైగా మృతి చెందారు.
కెనడియన్ ప్రచురణ గ్లోబల్ న్యూస్ నివేదించిన ప్రకారం… ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా (IRCC) తహవ్వూర్ రాణాకు 2001లో పొందిన కెనడియన్ పౌరసత్వాన్ని రద్దు చేయాలనుకుంటున్నట్లు తెలియజేసింది. 1997లో తహవ్వూర్ రాణా కెనడాకు వలస వెళ్లాడు. అయితే ఉగ్ర ఆరోపణలపై కాకుండా తప్పుడు సమాచారం ఆధారంగా పౌరసత్వం మంజూరు చేయబడిందని IRCC తన నోటీసులో పేర్కొంది. 2000 సంవత్సరంలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు కెనడాలో తన నివాసం గురించి తప్పుడు సమాచారం అందించాడని ఆ శాఖ ఆరోపించింది. దరఖాస్తు చేసుకోవడానికి ముందు నాలుగు సంవత్సరాలు ఒట్టావా, టొరంటోలో నివసించానని.. ఆ కాలంలో ఆరు రోజులు మాత్రమే దేశం నుంచి దూరంగా ఉన్నానని పేర్కొన్నాడు. అయితే రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) దర్యాప్తులో ఆ సమయంలో ఎక్కువ సమయం చికాగోలో గడిపాడని.. అక్కడ అనేక ఆస్తులను కలిగి ఉన్నాడని.. ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ, కిరాణా దుకాణం వంటి వ్యాపారాలను నిర్వహించాడని గ్లోబల్ న్యూస్ నివేదిక తెలిపింది. మొత్తానికి తప్పుడు సమాచారం కారణంగా పౌరసత్వం కలిగి ఉండడంతో రద్దు చేస్తున్నట్లు సమాచారం.
ఏప్రిల్ 10న అమెరికా నుంచి రాణాను రప్పించిన తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారికంగా అరెస్టు చేసింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నుంచి ప్రత్యేక విమానంలో అతన్ని న్యూఢిల్లీకి తీసుకొచ్చారు.