పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం కేసులో భారతదేశం మోస్ట్ వాంటెడ్ నిందితుల్లో ఒకరైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ప్రస్తుతం బెల్జియంలో ఉన్నట్లు యూరోపియన్ దేశం నిర్ధారించింది. బెల్జియం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో అతని ఆచూకీ తెలిపింది. ఇక వ్యక్తిగత కేసులపై తాము వ్యాఖ్యానించబోమని పేర్కొంది. అయినప్పటికీ కేసు యొక్క పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. చోక్సీ అప్పగింతపై భారత అధికారులు తమను సంప్రదించినట్లుగా బెల్జియన్ అధికారులు నిర్ధారించారు. ఇదే కేసులో సహ నిందితుడైన అతని మేనల్లుడు నీరవ్ మోడీని కూడా లండన్ నుంచి రప్పించేందుకు భారత అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: CBI Raids: మద్యం కుంభకోణం కేసు.. మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు..
పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.13,500 కోట్ల రుణ మోసం కేసులో నీరవ్ మోడీతో కలిసి నిందితుడిగా ఉన్న 65 ఏళ్ల చోక్సీ.. బెల్జియం పౌరురాలు అయిన భార్య ప్రీతి చోక్సీతో కలిసి ప్రస్తుతం ఆంట్వెర్ప్లో నివసిస్తున్నాడు. అయితే ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: AP News: రేపు చంద్రగిరిలో ఒక ఎంపీపీ, రెండు ఉప సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నికలు..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ను దాదాపు రూ.13,500 కోట్లకు పైగా మోసం చేశారని 2018లో ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం చోక్సీ, నీరవ్ మోడీ దేశం విడిచి పారిపోయారు. చోక్సీ ఆంటిగ్వా-బార్బుడాకు పారిపోగా.. నీరవ్ మోడీ బ్రిటన్ పారిపోయాడు. వీరిని భారత్కు రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇటీవల ఇండియా పర్యటనకు వచ్చిన ఆంటిగ్వా-బార్బుడా విదేశాంగ మంత్రి ఈపీ ఛెత్ గ్రీన్ మాట్లాడుతూ.. మెహుల్ చోక్సీ ప్రస్తుతం తమ దేశంలో లేరని, వైద్యం కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలిసిందన్నారు. చోక్సీ తమ దేశ పౌరుడేనని పేర్కొంటూ.. ఆయన్ను అప్పగించే విషయంలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు.