అఫ్గాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి.. స్థానికంగా పౌర హక్కుల కార్యకర్తలు, న్యాయమూర్తులు, పాత్రికేయులు భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు. మహిళల పరిస్థితి దీనంగా మారింది. తమను తాలిబన్లు వేటాడుతున్నారంటూ, ప్రాణభయం ఉందంటూ చాలామంది ఇది వరకే వాపోయారు.
కొందరు దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. తాజాగా ఇదే ప్రయత్నాల్లో ఉన్న మహిళా హక్కుల కార్యకర్త ఫ్రోజన్ సఫీతో సహా నలుగురు మహిళలను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బాల్ఖ్ ప్రావీన్స్లోని మజారే షరీఫ్లో వీరు హత్యకు గురయ్యారు. ఓ ఇంట్లో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయని తాలిబన్లు అధికారికంగా ప్రకటించారు. ఈ వ్యవహారంలో ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసినట్లు చెప్పారు.