పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బలూచిస్థాన్లోని ఓ పర్వత ప్రాంతంలో ఇరుకైన రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ వ్యాను 1,572 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణిస్తున్న వారిలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు.
బలూచిస్థాన్ రాష్ట్రంలోని ఝోబ్ నేషనల్ హైవేపై ఈ ఘటన జరిగిందని పాకిస్థాన్ వార్తా సంస్థ ‘డాన్’ వెల్లడించింది. అక్తర్జై ప్రాంతంలోని కిల్లా సైఫుల్లా వద్ద ఉన్న లోయలో వ్యాను పడిపోయిందని తెలిపింది. వాహనంలో 23 మంది వెళ్తున్నట్లు స్థానిక డిప్యూటీ కమిషనర్ హఫీజ్ మహమ్మద్ ఖాసిమ్ తెలిపారు.