Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..

Chhatrapati Sambhaji Maharaj

Chhatrapati Sambhaji Maharaj

Chhatrapati Sambhaji Maharaj Jayanti 2026: భారతీయ చరిత్రలో ధైర్యసాహసాలకు, అజేయమైన సంకల్పానికి మారుపేరు ఛత్రపతి శంభాజీ మహారాజ్. నేడు ఆ మహనీయుడి జయంతి. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జ్యేష్ఠ పుత్రుడైన శంభాజీ, మే 14, 1657న పురందర్ కోటలో శివాజీ, సాయిబాయి దంపతులకు జన్మించారు. దురదృష్టవశాత్తూ ఆయనకు రెండు ఏళ్ల వయసున్నప్పుడే తల్లి మరణించడంతో, తండ్రి శివాజీకి మార్గదర్శిగా నిలిచిన రాజమాత జిజాబాయి పర్యవేక్షణలోనే శంభాజీ పెరిగారు. పిలాజీ షిర్కే కుమార్తె జీవూబాయిని వివాహం చేసుకున్నారు.

1681లో సింహాసనాన్ని అధిష్టించిన శంభాజీ, తన తండ్రి ఆశయమైన ‘హిందవీ స్వరాజ్యాన్ని’ కాపాడటంలో ప్రాణాలకు తెగించి పోరాడారు. కేవలం యుద్ధ వీరుడిగానే కాకుండా, అనేక భాషల్లో ప్రావీణ్యం ఉన్న గొప్ప పండితుడిగా ఆయనకు పేరుంది. 1681 నుంచి 1689 వరకు సాగిన శంభాజీ పాలనలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దక్కన్ ప్రాంతాన్ని ఆక్రమించకుండా అడ్డుకోవడంలో శంభాజీ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా మొఘలుల కీలక నగరం బుర్హాన్‌పూర్‌పై ఆయన జరిపిన దాడి వారిని వణికించింది. సొంత కోటలోనే కొందరు శంభాజీ ప్రాణాలు తీయాలని కుట్రలు పన్నినప్పటికీ, వాటన్నింటినీ ఎదుర్కొని సామ్రాజ్యాన్ని విస్తరించారు.

అయితే 1689లో శంభాజీని ఔరంగజేబు బందీగా పట్టుకున్నాడు. ఇస్లాంలోకి మారాలని చిత్రహింసలు పెట్టారు. కొన్ని రోజుల పాటు ఆయన్ని తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసినా, శంభాజీ తన విశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని వదులుకోలేదు. చివరకు మార్చి 11, 1689న ఆయనను మొఘలులు అత్యంత కిరాతకంగా చంపారు. మరణం కళ్లముందు కనిపిస్తున్నా ఆయన చూపిన ధైర్యం దేశచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. శంభాజీ మహారాజ్ జీవితం పిల్లలకు ఎంతో స్ఫూర్తిదాయకం. క్రమశిక్షణ, దేశభక్తి, విద్యా ప్రాధాన్యత, కష్టకాలంలో నిలబడే మనస్తత్వాన్ని ఆయన జీవితం నేర్పిస్తుంది. ప్రస్తుతం శంభాజీ వీరగాథను నేటి తరానికి పరిచయం చేస్తూ బాలీవుడ్‌లో ‘ఛావా’ (Chhava) అనే సినిమా రూపొందింది. మరాఠీలో ‘ఛావా’ అంటే ‘సింహం పిల్ల’ అని అర్థం. ఇందులో విక్కీ కౌశల్ శంభాజీ పాత్రను పోషించగా.. రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా, దివ్య దత్తా, డయానా పెంటీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మరాఠా సామ్రాజ్య వైభవాన్ని, శంభాజీ త్యాగాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. నేడు శంభాజీ జయంతి (మే 14) సందర్భంగా ఆయన చూపిన పట్టుదల, ధైర్యం ప్రతి భారతీయుడి గుండెల్లో స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాయి.