China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పర్వతాలు బద్దలవుతున్నాయి.. బురద నీటి ఉగ్రరూపానికి సరిహద్దులు కొట్టుకుపోతున్నాయి.. ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు..! కానీ, ఇవే దృశ్యాలు ఒక్కసారిగా స్క్రీన్ల మీద నుంచి మాయమైపోతున్నాయి. డిజిటల్ తెరలపై కంటికి కనిపిస్తున్న విలయాన్ని రెప్పపాటులో తుడిచిపెట్టేస్తూ, అసలు అక్కడ ఏమీ జరగనట్టే ప్రపంచాన్ని నమ్మించే ఒక భయంకరమైన సైబర్ కుట్ర నడుస్తోంది. హిమాలయాల అంచున ఉన్న నేపాల్, టిబెట్లో ప్రకృతి ప్రకోపం సృష్టిస్తున్న భీభత్సం ఒకవైపు అయితే, ఆ భయానక నిజాన్ని ప్రపంచానికి తెలియకుండా దాచిపెడుతున్న చైనా సమాచార దిగ్బంధనం మరొకవైపు కలకలం రేపుతోంది.
నేపాల్-టిబెట్ సరిహద్దులోని ప్రధాన వాణిజ్య మార్గమైన గైరోంగ్ పోర్ట్ వద్ద భారీ బురద వరద, కొండచరియలు విరిగిపడి భవనాలను ముంచెత్తుతున్న భయంకర వీడియోలు తొలుత ఇంటర్నెట్లోకి వచ్చాయి.
రికార్డైన దృశ్యాలలో ప్రజలు ప్రాణాలు దక్కించుకోవడానికి ఆర్తనాదాలు చేస్తూ పరుగులు తీయడం స్పష్టంగా కనిపించింది. అయితే, ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మొదలైన కొద్ది గంటల్లోనే చైనా ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ల నుంచి ఒక్కొక్కటిగా అదృశ్యమయ్యాయి. సహాయం కోసం బాధితులు పెట్టిన పోస్టులు, ప్రత్యక్ష సాక్షుల వీడియోలు క్షణాల్లో డిలీట్ అయిపోయాయి. ప్రకృతి విపత్తులో చిక్కుకున్న ప్రజల ఆర్తనాదాల కంటే, ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందన్న భయమే చైనా సెన్సార్షిప్ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది.
Also Read
- Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
- Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
- Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
- AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
ఈ విపత్తు తీవ్రతకు సంబంధించిన గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. చైనా అధికారిక వర్గాలు చెప్పిన వివరాల ప్రకారమే, సరిహద్దు ప్రాంతంలో ఏకంగా 558 మంది గల్లంతయ్యారు. వీరిలో 260 మంది విదేశీయులు కూడా ఉన్నారు. ప్రారంభంలో మరణాల సంఖ్యను కేవలం 5గా మాత్రమే చూపించిన అధికార యంత్రాంగం, ఆ తర్వాత ఆ సంఖ్య మరింత పెరిగిందని అరకొర సమాచారంతో సరిపెట్టింది. సరిహద్దుకు ఆవలి వైపున ఉన్న నేపాల్లో వందలాది మృతదేహాలు వెలికితీస్తూ, వేలాది మంది గల్లంతైన పరిస్థితిని ప్రపంచ మీడియా స్వేచ్ఛగా రిపోర్ట్ చేస్తోంది. కానీ సరిహద్దుకు ఇవతల చైనా ఆక్రమిత టిబెట్ భూభాగంలో మాత్రం వాస్తవ నష్టం ఎంతనేది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. జర్నలిస్టులకు అనుమతి లేకపోవడం వల్ల ఈ 558 మంది జాడ ఏమైందనేది ప్రశ్నార్థకంగా మారింది.
చైనా చరిత్రను పరిశీలిస్తే ఇలా సమాచారాన్ని తొక్కిపెట్టడం కొత్తేమీ కాదు. 1950లలో టిబెట్ను ఆక్రమించుకున్న నాటి నుంచి బీజింగ్ ఆ ప్రాంతాన్ని ఒక క్లోజ్డ్ రూమ్ లాగా మార్చేసింది. విదేశీ జర్నలిస్టులు, పరిశోధకులు అక్కడికి వెళ్లాలంటే కఠినమైన ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి. టిబెటన్ పీఠభూమిలో చైనా నిర్మిస్తున్న భారీ డ్యామ్లు, పర్యావరణాన్ని విధ్వంసం చేసే మైనింగ్ ప్రాజెక్టులు, బలవంతపు పట్టణీకరణ.. హిమాలయ ప్రాంత జీవావరణాన్ని అత్యంత ప్రమాదకర స్థితిలోకి నెట్టాయి. భారీ వర్షాలు, భూతాపం వల్ల హిమానీనదాలు కరిగి సరస్సులు తెగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. పర్యావరణ విధ్వంసంపై బయటి ప్రపంచంలో చర్చ జరగకూడదనే ఉద్దేశంతోనే, భారీ వరదలు వచ్చినప్పుడు కూడా చైనా నిజాలు బయటకు చెప్పట్లేదు. కేవలం సైన్యం సహాయక చర్యలు చేపడుతున్న దృశ్యాలను మాత్రమే ప్రచార సాధనాల ద్వారా చూపిస్తోంది. అసలైన విలయాన్ని కప్పిపుచ్చుతోంది.
ప్రస్తుతం చైనా అధికారిక మీడియా.. అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇచ్చిన ఆదేశాలను, అక్కడ తిరుగుతున్న సహాయక బృందాలను మాత్రమే కెమెరాలలో బంధించి ప్రసారం చేస్తోంది. అంటే, సమస్య తీవ్రతను కాకుండా, ప్రభుత్వ స్పందనను మాత్రమే చూపేలా కథనాలను రూపొందించారు. బాధిత ప్రజలు తమ కష్టాలను చెప్పుకోవడానికి స్వతంత్ర వేదికలు లేకుండా చేయడమే చైనా “గ్రేట్ ఫైర్వాల్” లక్ష్యం. ఒక పక్క నదులు గ్రామాలపై విరుచుకుపడుతుంటే, మరోపక్క అధికార డిజిటల్ కత్తెర వాస్తవాలపై విరుచుకుపడుతోంది. నేపాల్ భూభాగంలో విధ్వంసం ప్రపంచం కళ్లముందు కదలాడుతుండగా, అదే భౌగోళిక ప్రాంతంలోని టిబెట్ పరిసరాలు చీకటి తెరల వెనుక మగ్గిపోతున్నాయి.
ప్రకృతి విపత్తులను ఎవరూ పూర్తిగా ఆపలేకపోవచ్చు, కానీ బాధితుల ఆర్తనాదాలను సాంకేతికతతో తొక్కిపెట్టడం అత్యంత హేయమైన చర్య. టిబెట్లో నీటి ప్రవాహాల కంటే సమాచార నియంత్రణ వేగంగా ప్రవహిస్తోంది. డిజిటల్ రికార్డులను చెరిపేయడం ద్వారా ఒక ప్రాంతాన్ని ప్రపంచ పటంలో నిశ్శబ్దంగా ఉంచగలరేమో కానీ, ప్రకృతి సృష్టించిన విధ్వంసాన్ని, నష్టపోయిన వందలాది కుటుంబాల వేదనను చరిత్ర నుంచి ఎప్పటికీ తుడిచిపెట్టలేరు. పారదర్శకత లేని అభివృద్ధి, నిజాలను సమాధి చేసే పాలన.. ఎప్పటికైనా హిమాలయాల కంటే పెద్ద విపత్తుగా మారక తప్పదు.
:- CLN RAJU (EDITOR- NTV DIGITAL)
- Tags
తాజావార్తలు
-
China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
-
APFDC: సినిమా షూటింగ్స్కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్గా మార్చేందుకు కీలక నిర్ణయాలు
-
Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!