Vizag Crime: విశాఖపట్నం గాజువాకలో జరిగిన యువతి మౌనిక హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో తాజాగా బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మొదట సాధారణంగా కనిపించిన ఈ ఘటనలో కొత్త కొత్త విషయాలు బయటకు రావడంతో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, మార్చి 29న మౌనికను ఆమె ప్రియుడు రవీంద్ర హత్య చేసినట్లు తేలింది. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్లో దాచినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసులో నిందితుడు రవీంద్రను పోలీసులు మూడు రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు మరో ఇంటిని తనిఖీ చేయగా, అక్కడ కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. దీంతో ఈ హత్య కేసు మరింత క్లిష్టంగా మారింది. నిందితుడు హత్య అనంతరం లొంగిపోవడం కూడా పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు చేసిన ప్రయత్నమేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ హత్యను రవీంద్ర ఒక్కడే చేశాడా? లేక మరెవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రవీంద్ర స్నేహితుడి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మౌనికను రవీంద్ర తన నివాసంలోనే హత్య చేశాడా? లేక వేరే ప్రదేశంలో ఈ దారుణానికి పాల్పడ్డాడా? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కేసులో అనేక అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు రీ-ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ కేసులో మరెవరెవరి హస్తం ఉందనే అంశంపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ప్రజల్లో భయాందోళనలు నెలకొనగా, పోలీసులు త్వరలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశముంది.